'దొంగలెక్కలు చెప్పకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయండి'
హైదరాబాద్ : రెతుల ఆత్మహత్యలపై దొంగలెక్కలు చెప్పి మోసగించకుండా వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, టీపీసీసీ కిసాన్సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 1007 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 97 మంది మాత్రమే అంటూ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాల సంఖ్యను పార్లమెంటుకు ఇచ్చిందని వారు విమర్శించారు.
గుళ్లు, గోపురాలు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ పార్టీ బలాన్ని పెంచుకోవడానికి తప్ప రైతుల సమస్యలను పట్టించుకునేందుకు ఆయనకు సమయం ఉండటం లేదని శ్రవణ్ విమర్శించారు. ఇంకా బేషజాలకు పోకుండా వెంటనే అఖిలపక్షం ఏర్పాటుచేసి, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు, రాజకీయపార్టీలతో కమిటీ వేయాలని కోరారు.