కన్నబిడ్డ కళ్లముందే...
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్
- మహిళ దుర్మరణం, పరారైన డ్రైవర్
రెయ్యిపాడు (వజ్రపుకొత్తూరు): కన్న కొడుకు కళ్లెదుటే ఘోరం జరిగిపోయింది. తల్లిని బైకుపై ఎక్కించుకుని బంధువుల ఇంటికి వెళ్తుండగా ట్రాక్టరు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడంతో ఆ కొడుకు హతాశుడయ్యాడు. తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన వజ్రపుకొత్తూరు మండలం లో చోటుచేసుకుంది. మండలంలోని రెయ్యిపాడు వద్ద మంగళవారం ట్రాక్టరు ఢీకొని హుకుంపేటకు చెందిన కొమర చంద్రావతి(49) అక్కడికక్కడే మృతి చెందారు. హుకుంపేట నుంచి భావనపాడు వెళ్లేందుకు కుమారుడు కొమర శంకరరావుతో కలిసి హీరో హోండా ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కొమర చంద్రావతి తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు స్వగ్రామం హుకుంపేట నుంచి కుమారునితోకలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలో రెయ్యిపాడు వద్దకు వచ్చేసరికి మురిపింటివానిపేటకు చెందిన ఎల్. చిరంజీవికి చెందిన ట్రాక్టర్ వీరిని ఢీకొంది. ద్విచక్రవాహనం ముళ్లకంచెపై పడిపోగా, బైక్ వెనుక కూర్చున్న చంద్రావతి కింద పడడంతో ట్రాక్టర్ ఆమె తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జయింది. వాహనాన్ని నడుపుతున్న మృతురాలి కుమారుడు శంకరరావుకు స్వల్పగాయాలైయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్కు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేవని, రిజిస్ట్రేషన్ నంబరు కూడా లేదని పోలీసులు చెప్పారు. శంకరరావు ఫిర్యాదు మేరకు జ్రపుకొత్తూరు పోలీసులు శవ పంచనామా నిర్వహించి, పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.