breaking news
Turakapalem
-
మెలియోడోసిస్ వల్లే మరణాలు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ వీడనుంది. గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, బయోకెమిస్టులు గ్రామస్తుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. గ్రామంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. గ్రామ ప్రజల మరణాలకు అత్యంత అరుదైన మెలియోడోసిస్ వ్యాధి కారణమని దాదాపు నిర్ధారించారు. బర్డె్కలియా–సుడోమలై అనే బ్యాక్టీరియా వల్ల ప్రజలు జ్వరాల బారిన పడి మరణిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 40 రకాల వైద్య పరీక్షలు తురకపాలెం గ్రామంలో 2,507 మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 500 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలకు మినహా మిగతావారందరికి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది సుమారు 40 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. శనివారం శాంపిల్స్ సేకరించి వైద్య కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ సుందరాచారి, గుంటూరు డీఎంహెచ్వో డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.గత నెలలో స్పందించి ఉంటే... గత నెలలోనే తురకపాలెంలో జ్వరంతో బాధపడుతున్న వారికి గుంటూరులోని ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు డాక్టర్ కోగంటి కళ్యాణ్చక్రవర్తి వైద్య పరీక్షలు చేసి, మెలియోడోసిస్ వ్యాధిగా నిర్ధారించారు. ఆ విషయం మీడియా ద్వారా సైతం వెల్లడించారు. ప్రైవేటు వైద్యుడు వ్యాధి నిర్ధారించి, చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన సమయంలోప్రభుత్వ వైద్య అధికారులు, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం స్పందించి ఉంటే మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండేది. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే మరణాలు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తురకపాలెంలో ‘ఈనాడు’ ప్రతుల దహనంమృతుల గురించి అసత్య ప్రచురణలు అసహ్యం కలిగిస్తున్నాయి ఎయిడ్స్తో మృతి చెందారని ఈనాడు, ఈటీవీల్లో ప్రచారం చేయటం దారుణం బాధితులకు న్యాయం చేయాల్సిన మీడియా ప్రభుత్వానికి కొమ్ముకాయడం దుర్మార్గం గ్రామ ప్రజల ఆగ్రహంగుంటూరు రూరల్: గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియోడోసిస్ బ్యాక్టీరియాతో యువత సైతం మృత్యువాత పడుతుంటే ఈనాడు, ఈటీవీల్లో మృతుల పట్ల అసత్య ప్రచారం చేయడం అసహ్యం కలిగిస్తోందని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలోని యువకులు ఎయిడ్స్, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మృతి చెందారని టీవీలో బాహాటంగా ప్రచారం చేయటం గ్రామ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఈనాడు దినపత్రిక ప్రతులను శనివారం గ్రామ ప్రజలు దహనం చేశారు. బాధలో తాముంటే, న్యాయం చేయాల్సింది పోయి మృతుల గురించి అసత్య వార్తలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. ఇంటి పెద్దలు మృతిచెంది పిల్లలు, తల్లులు రోడ్డున పడ్డ సమయంలో ఇటువంటి అసత్య ప్రచారం చేసి గ్రామ పరువును, ప్రతిష్టను దెబ్బతీసిన ఈనాడు, ఈటీవీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ ఈనాడు, ఈటీవీ, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశి్నంచాల్సిన మీడియా ఇలా ప్రభుత్వానికే కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. -
తురకపాలెంలో బ్యాక్టీరియాపై సమాచారం లేదు
గుంటూరు రూరల్: ‘‘కలుషిత నీరు అంటూ తురకపాలెంలో మరణాలకు రకరకాల కారణాలు చెబుతున్నారు. అసలు ఎలాంటి బ్యాక్టీరియా అనేది అంతుచిక్కలేదు. మెలియోడోసిస్పై సమాచారం లేదు. ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు వార్తలొచి్చనా రక్త నమూనాల పరీక్షల ఫలితాల్లో అలాంటిది కనిపించలేదు’’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ తెలిపారు. బాధితులకు గుంటూరు జీజీహెచ్లో పూర్తి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తురకపాలెంలో శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి ఆయన పర్యటించారు. జూలై నుంచి 23 మంది చనిపోయారని, అయినా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ఉన్నతాధికారులను అప్రమత్తం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మరణాలకు కారణాలపై లోతుగా విశ్లేషణ చేస్తున్నామని, 14 వైద్య బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అందరి రక్త, నీరు, మట్టి నమూనాలూ తీసుకున్నారని చెప్పారు. తురకపాలెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరీక్షల నిర్వహణ వివరాలను మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరణాల సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకురావడంలో జరిగిన వైఫల్యాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలన్న దానిపై సిఫారసులు చేసేందుకు ఐఏఎస్ అధికారి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ అట్టాడ సిరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో విఫలమైన వైద్య ఆరోగ్య సిబ్బందిపై శాఖాపరంగా చర్యలుంటాయన్నారు. -
ఈవెంట్ మేనేజ్మెంట్పై శ్రద్ధ.. ప్రజల ప్రాణాలపై లేదే!
‘‘యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రెండు కోట్ల రిజిస్ట్రేషన్లు చేయాలి’’ అంటూ అన్ని శాఖల యంత్రాంగం మెడపై సీఎం చంద్రబాబు కత్తిపెట్టారు. దీంతో ఎలాగైనా విజయవంతం చేయాలని మే, జూన్ నెలల్లో వీఆర్వో నుంచి సీఎస్ వరకు ప్రభుత్వం మొత్తం యోగాంధ్రలో తలమునకలైంది. కొన్నేళ్ల కిందట చనిపోయినవారు, విదేశాల్లో ఉంటున్నవారు, చిన్నపిల్లల పేరిట కూడా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయించి సీఎంను మెప్పించారు. యోగాంధ్ర పూర్తవగానే యంత్రాంగంపై పీ4 పిడుగు పడింది. దీన్ని విజయవంతం చేయాల్సిందేనని సీఎం హుకుం జారీ చేశారు. మార్గదర్శకులను దొరకబట్టడం, లేకుంటే చిరుద్యోగులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించడంలో పెద్ద సార్లంతా నిమగ్నమయ్యారు. ...ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్పై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు ప్రజల ప్రాణాల రక్షణపై కూడా పెట్టి ఉంటే తురకపాలెంలో మృత్యుఘోషకు ఆదిలోనే అడ్డుకట్ట పడి ఉండేది.సాక్షి, అమరావతి: క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, అంతర్జాతీయ రాజధాని, బుల్లెట్రైన్ అంటూ పడికట్టు పదాలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం చంద్రబాబు.. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో కనీసం సురక్షిత మంచినీటిని సరఫరా చేయకపోవడం ఆయన చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని యోగాంధ్రకు పరిమితం చేసిన మే, జూన్ నెలల్లోనే తురకపాలెంలో సమస్య మరింత తీవ్రమైనట్లు స్పష్టమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జూలైలో 10 మంది, ఆగస్టులో 10 మంది చనిపోయారు. గ్రామంలో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల కేసులు, మరణాలు మొదలైననాటి నుంచే ఆశాలు, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రమాద ఘంటికలను ప్రభుత్వం పసిగట్టలేదు. కిందివారిని బలి చేస్తే సరి..ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడ అమాయకులు మరణించినా విచారణలు జరిపి ఒకరిద్దరు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. గోదావరి పుష్కరాలు, తిరుపతి తొక్కిసలాట, గోడ కూలి సింహాచలంలో భక్తుల మృతి ఘటనల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. తురకపాలెం మరణాలపై సిబ్బంది నుంచి సమాచారం లేదంటూ ఉన్నతాధికారులు ఓ కట్టుకథ సిద్ధం చేశారు.ఒక విచారణ చేసి తప్పంతా సిబ్బంది, ఒకరిద్దరు అధికారులదేనని నిరూపించే ప్రక్రియలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టర్తో విచారణకు ఆదేశించామని వైద్య శాఖ మంత్రి ప్రకటన చేశారు. మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం అందలేదని బూటకపు ప్రకటనలు చేశారు. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే.. కింది స్థాయి సిబ్బందిపైనే నెపం..గ్రామంలో ప్రజలు అనారోగ్యం పాలవడం, మరణాలపై ఎప్పటికప్పుడు ఆశా, ఏఎన్ఎంలు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలైన్స్ ప్రోగ్రాం (ఐడీఎస్పీ) కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో నమోదు చేస్తూ వస్తున్నారు. దీని ఆధారంగానే జనవరి–మార్చి మధ్య ఐదుగురు, ఏప్రిల్లో ఇద్దరు, మేలో ముగ్గురు, జూన్లో ఇద్దరు, జూలైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబరులో ముగ్గురు మరణించినట్టు గురువారం వైద్య శాఖ మంత్రే వెల్లడించారు. కానీ, కేసుల నమోదు తీరును పసిగట్టి పైఅధికారులను అప్రమత్తం చేయలేదని నెపం మోపుతూ తప్పంతా క్షేత్ర స్థాయి సిబ్బందిపై నెట్టేస్తున్నారు. ఐడీఎస్పీ పోర్టల్లో రాష్ట్రంలో నమోదయ్యే జ్వరాలు, డెంగీ, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలు, వాటి ద్వారా సంభవించిన మరణాల వివరాలు క్షేత్రస్థాయి సిబ్బంది నమోదు చేసేవే. ఇది ఏడాదిలో 365 రోజులూ నడిచే ప్రక్రియ. ఐడీఎస్పీ వివరాల ఆధారంగానే వ్యాధులు, మరణాల నియంత్రణకు ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రజారోగ్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలు ఐడీఎస్పీలో అనారోగ్య కేసుల నమోదుపై సమీక్ష చేయాలి. గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియ పక్కాగా అమలయ్యేది. ఇప్పుడు పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ కారణంగానే తురకపాలెం మరణాలు సంభవించాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి ఈ వ్యాధిని, మరణాలను అరికట్టాల్సిన పాలకులు, ఉన్నతాధికారులు ఈవెంట్ మేనేజ్మెంట్లలో మునిగిపోవడంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మరణమృదంగం
-
తురకపాలెంలో కునుకు కరువు
మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అనేది బర్ఖోల్డెరియా సూడోమల్లె అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన వ్యాధి. ఇది కలుషితమైన నేల లేదా నీటి నుంచి సంక్రమిస్తుంది. కొన్నిసార్లు కలుషితమైన ధూళిని పీల్చడం ద్వారా కూడా సోకే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా, ఉత్తర ఆస్ట్రేలియా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారీ వర్షం లేదా తుపానుల తర్వాత ఇది బయట పడుతుంది. చర్మం రంగు మారడం, చర్మంపై గడ్డలు, న్యుమోనియా ద్వారా తీవ్ర జ్వరం, తీవ్ర తల నొప్పి, షాక్లోకి వెళ్లడం ప్రధాన లక్షణాలు. మధుమేహం, కిడ్నీ సంబంధిత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, మద్యపాన వ్యసనపరులకు ఎక్కువ ప్రమాదం. ప్రస్తుతం తురకపల్లె మరణాలకు ఈ బ్యాక్టీరియా లేదా దీనిని పోలిన మరో బ్యాక్టీరియానే కారణమని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు/ సాక్షి, అమరావతి/ ప్రత్తిపాడు : రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న ఆ గ్రామంలో నాలుగైదు నెలలుగా ప్రజలకు కునుకు కరువైంది. ఉన్నట్లుండి తీవ్రంగా జ్వరం రావడం.. ఆ తర్వాత అంతు చిక్కని జబ్బుబారిన పడటం.. ఇలా ఇబ్బంది పడిన వారిలో ఉన్నట్లుండి పలువురు మృతి చెందడం కలకలం రేపుతోంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో దాదాపు 3 వేల జనాభా ఉంటుంది. సరిగ్గా 834 గడపలు. ఏప్రిల్, మే నెలల నుంచి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి మందులతో జబ్బు నయం అవ్వగా, మరికొందరు ఆరోగ్యం కుదుట పడక ఆస్పత్రుల పాలయ్యారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం ఐదు నెలల్లో 286 మంది, లెక్కల్లోకి రాని మరికొన్ని వందల మంది జ్వర బాధితుల్లో 45 మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇందులో 30 మరణాలు మాత్రమే వైద్య శాఖ లెక్కల్లోకి ఎక్కాయి. అయినప్పటికీ రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ ఈ విషయమై పట్టించుకున్న పాపాన పోలేదు.రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సీఎంకు పట్టడం లేదనడానికి ఈ ఘటనే పెద్ద నిదర్శనం. ఐదు నెలల్లో 45 మంది చనిపోతే సీఎం స్థాయిలో ఒక సమీక్ష లేదు. కనీసం వైద్య శాఖ మంత్రి కూడా సమీక్ష చేయలేదు. ఏప్రిల్లో మరణాలు మొదలైతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గురువారం తురకపాలెం ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష చేసినట్టు గొప్పగా ప్రకటించుకున్నారు. కబుర్లతో కాలక్షేపండ్రోన్లు ఎగరేస్తాం.. దోమలు చంపేస్తాం.. రోగాలు నిర్మూలిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో కబుర్లతో కాలక్షేపం చేస్తోందనడానికి గుర్లలో కలరా, ప్రస్తుత తురకపాలెం ఘటనలే అద్దం పడుతున్నాయి. గ్లోబల్ హెల్త్ టూరిజానికి డెస్టినేషన్గా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పే సీఎం.. అమరావతిని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజల ప్రాణాలను రక్షించలేని స్థితిలో ఉన్నారని తేటతెల్లం అయింది. వాస్తవానికి తురకపాలెంలో ఏప్రిల్ నుంచి జనాలు జ్వరాల బారినపడి మృత్యువాత పడుతున్నట్టు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రొగ్రామ్ (ఐడీఎస్పీ) కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్, ఏఎన్ఎంలు ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న అనారోగ్య బాధితులు, మరణాల సంఖ్యను గుర్తించి ప్రభుత్వం జూన్, జూలై నెలల్లోనే అప్రమత్తం అయి ఉంటే 20కి పైగా మరణాలను కట్టడి చేయడానికి వీలుండేది. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడనే లేదు. అనారోగ్యం బారినపడిన బాధితులు గుంటూరు జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతూ మరణించారు. అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో ఏం జరుగుతోందనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నగరంలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ సోకడంతో మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించిన మూడు వారాలకు, మీడియాలో వార్తలొచ్చాక తీరిగ్గా ప్రభుత్వం నిద్ర లేచింది. మంగళవారం నుంచి గ్రామంలో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి నీటి నమూనాలు, బాధితుల్లో ఇన్ఫెక్షన్ నిర్ధారణకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపింది. దీన్ని బట్టి ఐదు నెలల్లో కనీసం గ్రామంలో వైద్య వర్గాలు పర్యటించి నీటి, రక్త నమూనాలు కూడా సేకరించలేదని స్పష్టంగా అర్థం అవుతోంది. గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో కలారా వ్యాప్తి ఘటన తరహాలోనే తురకపాలెంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. గుర్లలో గతేడాది సెప్టెంబర్లో నీరు కలుషితమై ప్రజలు వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలవ్వడం మొదలైంది. కొందరు మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్టోబర్లో సమస్య తీవ్రమయ్యాక తేరుకుని మెడికల్ క్యాంప్ల పేరిట హడావుడి చేసింది. అయితే అప్పటికే 14 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాధితుల్లో దళితులే ఎక్కువ» ఒక ఇంట్లో జ్వరం వచ్చిందని ఒకరు.. మరో ఇంట్లో కాళ్ల నొప్పులతో ఇంకొకరు, మరో వీధిలో అకస్మాత్తుగా ఆనారోగ్యానికి గురై ఇంకొకరు, అదే వీధిలో ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరొకరు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో అనారోగ్య కారణంతో రోజుల వ్యవధిలోనే కళ్లు మూశారు. జ్వరాలు, వాపులతో ఆస్పత్రులకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో.. లేదో.. తెలియని పరిస్థితి. ఇంటికి వచ్చినా క్షేమంగా ఎప్పటిలానే ఆరోగ్యంగా ఉంటారా? ఉంటే ఎంత కాలంలో ఉంటారో కూడా అర్థం కాని అయోమయ దుస్థితి. వడ్డీలకు అప్పులు తెచ్చి తమ వారిని కాపాడుకోవాలనుకుంటున్న వారి వేదన అరణ్య రోదనగా మారుతుంది. » నీరు కలుషితం అయ్యిందని, ఈ నీటిని తాగడం వల్ల దద్దుర్లు, అనారోగ్యం కలుగుతోందని గ్రామస్తులు గత ఏడాది ఆక్టోబర్లోనే ఫిర్యాదు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించ లేదు. గతంలో కాలువ నుంచి వచ్చే తాగునీటిని సమీపంలోని క్వారీ గుంటలోకి తరలించి అక్కడి నుంచి నీటి ట్యాంక్లకు ఎక్కించి సరఫరా చేసేవారు. ఆ క్వారీ గుంట నాచు పట్టి పూర్తిగా కలుషితమై ఉంది. ఇప్పటికీ అక్కడి నుంచే నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. » ఐదారుగురు మినహా మృతులంతా 50 ఏళ్లలోపువారే. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఆర్గాన్స్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, విష జ్వరాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మృతుల్లో దళితులే అధికం. » ఈ గ్రామం చుట్టూ వాటర్ ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. డబ్బున్న వారు ప్లాంట్ల నీటిని ఉపయోగిస్తుండగా, పేదలంతా ప్రభుత్వం సరఫరా చేసే నీటిని తాగుతున్నారు. ఇలా ఈ నీటిని తాగుతున్న వారి ఇళ్లలోనే ఈ మరణాలన్నీ చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం కూడా పూర్తిగా లోపించింది. » ఇక్కడ పరిస్థితుల గురించి మీడియాలో వార్తలొచ్చాక హడావుడిగా శుక్రవారం డ్రైన్లను శుభ్రపరచడం గమనార్హం. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో కలసి గ్రామంలో పర్యటించారు. అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. రక్త నమూనాలు సేకరించారు. కాగా, సురక్షిత మంచి నీరు దొరకని ఈ గ్రామంలో ఐదు బెల్టు షాపుల్లో కావాల్సినంత మద్యం దొరకడం విశేషం. జ్వరంతో మొదలై.. కిడ్నీలు ఫెయిల్నా భర్త శీలం వేళంగి (43)తో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లే దాన్ని. నెల కిందట మా ఆయనకు తొలుత జ్వరం వచ్చింది. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాం. అయినా తగ్గలేదు. ఇంతలో నడుము సమీపంలో ఓ గడ్డ వచ్చింది. గడ్డ వల్లే జ్వరమనుకుని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించాం. అయినా జ్వరం తగ్గలేదు. మరో ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇంకొక ఆస్పత్రి.. ఇలా నాలుగైదు ఆస్పత్రులకు తీసుకెళ్లాం. చివరకు చేర్పించిన ఆస్పత్రిలో పరీక్షలు చేశాక.. కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. కోలుకోలేక కొద్ది రోజులకే చనిపోయాడు. బయట రూ.3 వడ్డీతో రూ.7 లక్షలు అప్పు తెచ్చి వైద్యం చేయించాం. ఇంత చేసినా మనిషిని మాత్రం కాపాడుకోలేకపోయాం. – శీలం మేరి, తురకపాలెంకాలికి చిన్న దెబ్బ.. హఠాత్తుగా మృతిమా ఆయన కట్టా దీన రాజు (35) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొద్ది రోజుల కిందట ఓ చిన్న ప్రమాదంలో కాలికి దెబ్బ తగిలి వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎక్సరే తీసి అంతా బాగుందని చెప్పి మాత్రలిచ్చారు. అవి వాడిన తర్వాత కూడా కాలి వాపు తగ్గలేదు. మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా అంతా బాగానే ఉందని చెప్పి మందులు రాసిచ్చారు. ఆ తర్వాత కూడా ఆరోగ్యం బాలేకపోతే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఒకటి రెండు రోజులకే ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆయాసం వచ్చి చనిపోయారు. ఎక్కడికి వెళ్లినా ఏమీ కాదన్నారు.. అంతా బాగుందన్నారు.. మరెందుకు చనిపోయినట్లు? ఇద్దరు పిల్లలను పెట్టుకుని నేను ఎలా బతకాలి? – కట్టా భాగ్యరాణి, తురకపాలెంఉన్నట్లుండి చనిపోయాడు నా భర్త పచ్చల సురేష్ (41) ఆరోగ్యంగా ఉండేవాడు. ఒక రోజు ఉన్నట్లుండి ఒంట్లో నలతగా ఉందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే ఏమీ లేదని చెప్పారు. కానీ ఒక రోజు ఉన్నట్లుండి చనిపోయాడు. ఎలా చనిపోయాడో.. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు పదవ తరగతి, మరొకరు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. నా భర్త తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ఇటీవల నా సోదరుడు కూడా ఇలానే చనిపోయాడు. మా గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. – పచ్చల క్రాంతి, తురకపాలెంకాళ్ల నొప్పితో వెళ్లి.. కన్నుమూసి.. మా మామ దొడ్డా శౌరిబాబు(44) క్రషర్లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఒక రోజు జ్వరం వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఆ తర్వాత సడెన్గా కాలునొప్పి అని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు మందులిచ్చారు.ఏదో వైరస్ వల్ల ఇలా అయిందని చెప్పారు. గ్రామంలో పరిస్థితి బాగోలేక పోవడంతో వారం రోజులు ఇక్కడ, మరో వారం రోజులు చిలకలూరిపేట దగ్గర అత్తగారి ఇంట్లో ఉంటూ క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటూ వచ్చాడు. ఒక రోజు రాత్రి సడెన్గా కన్ను మూశాడు. మా మామ వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఆయన వైద్యం కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. – దొడ్డా అరుణ (మేన కోడలు), తురకపాలెంమెల్ల కన్ను వచ్చి.. కోమాలోకి వెళ్లి.. నా భర్త జూపల్లి పరిశుద్ధ రావు (46) క్రషర్లో కూలి పనులు చేసేవాడు. కొద్ది రోజుల కిందట జ్వరం, కాలి నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లాం. రెండు నెలల పాటు జ్వరం రావడం, తగ్గిపోవడం జరిగింది. ఒకరోజు కళ్లు వంకర్లు పోయి మెల్ల కన్ను వచ్చేసింది. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఖర్చులు భరించలేక ఇంటికి తీసుకువచ్చి మందులు వాడాం. ఆ తర్వాత ఉన్నట్లుండి చూపు పోయి.. నోటి నుంచి నురగ వచ్చింది. కాలి వాపు కూడా రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదే రోజు కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకే కన్ను మూశాడు. మాకు ఒక కుమారుడు. ఇప్పుడు ఎలా బతకాలో అర్థం కావడం లేదు. – జూపల్లి మేరి, తురకపాలెం -
‘ప్రభుత్వ నిరక్ష్యంతోనే తురకపాలెంలో మరణమృదంగం’
తురకపాలెం: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గడిచిన రెండు నెలలుగా జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాలతో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీఅధ్యక్షులు అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్సీపీకి చెందిన డాక్టర్లు, నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం తురకపాలెం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో మృతుల కుటుంబాలతో మాట్లాడి, మరణాలకు గల కారణాలపై వివరాలు సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాగునీరు కలుషితం అవ్వడం వల్లే గ్రామస్తులు అస్వస్తతకు గురై, మృత్యువాత పడుతున్నారని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు వైఎస్సార్సీపీ వైద్య విభాగం ప్రతినిధులు తెలిపారు. నీరు కలుషితం అవుతోందని నెల రోజుల కిందటే వైఎస్సార్సీపీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గ్రామంలోని ప్రజలకు రక్తపరీక్షలు జరిపించాలని, అస్వస్తతకు గురైన వారికి గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే...స్పెషలిస్ట్ డాక్టర్లను రప్పించాలిమాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిగుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో రెండు నెలలుగా దాదాపు 40 మందికి పైగా జ్వరం బారిన పడి అకస్మాత్తుగా చనిపోతున్నారు. మృతుల్లో 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు కూడా ఉండటం కలవరపరుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలను సందర్శించి వారితో మాట్లాడటం జరిగింది. వైయస్సార్సీపీ తరఫున గ్రామాన్ని సందర్శించి దీనికి గల కారణాలపై అన్వేషణ చేస్తే గ్రామానికి సరైన మంచినీటి సదుపాయం లేదని అర్థమైంది. క్వారీ గుంతల్లో నుంచి పైపులైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకుకి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగిన వారే రోగాల బారిన పడి చనిపోతున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. గుంటూరు నగరానికి ఈ గ్రామం నుంచి రోజూ 45 లక్షల నీరు వెళ్తున్నా, వీరికి మాత్రం సురక్షితమైన మంచినీరు దొరకడం లేదు. మృతులకు చికిత్స చేసిన డాక్టర్లతో మాట్లాడితే మిలినియోసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని రిపోర్టులు ద్వారా తెలుస్తోందని చెప్పారు. అపరిశుభ్ర పరిసరాలు, వాతావరణం, తాగునీటి కారణంగానే ఈ బ్యాక్టిరియా వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. తక్షణమే ప్రభుత్వం ఓవర్హెడ్ ట్యాంక్ నీటి సరఫరాను ఆపేసి సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న క్యాంపుల వల్ల గ్రామానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీహెచ్ సీ డాక్టర్లతో ఏం ప్రయోజనం ఉండదు. మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావాలి. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఈ గ్రామస్తుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలి. సాధారణ మందుల ద్వారా ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమయ్యే పనికాదు. బాధితులకు మంచి మందులు తెప్పించి అందించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా గ్రామస్తులు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని మరిగించి తాగాలి. స్నానం చేసే నీటిలో కూడా డెటాల్ వేసుకోవాలి.మైనింగ్ గుంతల్లో నీరు సరఫరా చేయడం వల్లేసత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిగత రెండు నెలలుగా తురకపాలెం గ్రామంలో జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. జ్వరాల బారిన పడి వారం రోజుల్లోనే చనిపోతున్న ఘటనలు రెండు నెలలుగా జరుగుతున్నాదానికి కారణాలను ప్రభుత్వం ఇంతవరకు కనుక్కోలేకపోయింది. పీహెచ్సీ డాక్టర్లతో మాట్లాడితే శాంపిల్స్ పంపినా ఇంకా రిపోర్టులు రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీతరఫున గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను కలిసి వివరాలను సేకరించాం. వారు చెప్పిన దాని ప్రకారం జ్వరం రావడం, నాలుగైదు రోజుల తర్వాత తగ్గడం మళ్లీ రావడం, ఒళ్లు నొప్పులు, కండరాలు నొప్పులు వేధిస్తున్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత తీవ్రమైన ఆయాసం, గుండెనొప్పి రావడంతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నట్టు తెలిసింది. ఏడెనిమిది మంది ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది జ్వరం తగ్గిందని ఇంటికొచ్చినా మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రికి వెళ్లేలోపే మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కాలువలు, వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా గ్రామస్తులంతా అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల్లో జ్వరాల బారిన పడి చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి రక్షణ చర్యలు తీసుకోకపోతే మరణాలు మరిన్ని సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. గ్రామస్తులు కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. గ్రామం నుంచి రోజుకి 45 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడేసి అక్రమంగా సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మైనింగ్ గుంతల్లో నుంచి తోడిన నీటిని తాగడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీప్రభుత్వంలో మాదిరిగా విలేజ్ క్లీనిక్స్ అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం తక్షణం గ్రామస్తుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని కల్చర్ టెస్టు చేయాలని వైఎస్సార్సీపీతరఫున డిమాండ్ చేస్తున్నాం.జ్వరంతో మొదలై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నారుడాక్టర్ అశోక్తురకపాలెంలో వరుస మరణాలకు గల కారణాలను అన్వేషించడానికి వైఎస్సార్సీపీతరఫున గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చనిపోయిన ప్రతిఒక్కరూ జ్వరం, ఆయాసంతో బాధపడిన వారే. మృతులంతా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో వారం రోజుల్లోనే చనిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇక్కడ జరుగుతున్న మరణాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఈ గ్రామంలోని బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషాలిటీ మెడికల్ వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలి. గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. గ్రామంలో మట్టి, నీరు కలుషితం జరుగుతోందని గుర్తించాం. గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. పారిశుద్ధ్య పరిరక్షణ మీద కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.నెల క్రితమే కలెక్టర్కి వైఎస్సార్సీపీఫిర్యాదు చేసినా పట్టించుకోలేదుగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుతురకపాలెంలో జరుగుతున్న మరణమృదంగంపై ప్రభుత్వం సీరియస్గా విచారణ చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకే గ్రామంలో ఒకే రకమైన వ్యాధితో 40 మందికి పైగా చనిపోవడం మామూలు విషయం కాదు. వైఎస్సార్సీపీతరఫున మేము గ్రామానికి వస్తున్నామని తెలిశాకనే ప్రభుత్వం స్పందించింది. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో బోర్ల ద్వారా తోడిన నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకు సరఫరా చేస్తున్నారు. గ్రామస్తులకు మాత్రం (సంజీవయ్య గుంట) నుంచి క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తించాం. ఈ గుంతల్లోకి నీరు కొండల్లో నుంచి వస్తుంది. ఆ నీటితోపాటు బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా కలిసి నీరు కలుషితమవుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టి పెట్టాలి. మేం గ్రామంల పర్యటిస్తే తప్ప ఆరోగ్యశాఖ మంత్రిలో కదలిక రాలేదు. అధికారుల మీద నిప్పులు చెరిగారని టీవీల్లో బ్రేకింగులు వేసుకుంటున్నారు. కలుషిత నీటి సరఫరా జరుగుతోందని నెల క్రితమే జిల్లా కలెక్టర్కి నెల రోజుల క్రితమే వైఎస్సార్సీపీతరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తక్షణమే గ్రామానికి ఆరోగ్యశాఖ మంత్రిని పంపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలి. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుంది.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిమాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డిమా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైయస్సార్సీపీ బృందం గ్రామంలో పర్యటించింది. మేం వస్తున్నామని తెలిసి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పర్యవేక్షణలో హడావుడిగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదని వారికి కూడా తెలుసు. గుంటూరు పక్కనే కూతవేటు దూరంలో తురకపాలెం గ్రామంలో రెండు నెలలుగా అకాల మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని దుస్థితికి ప్రభుత్వం సిగ్గుపడాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీపోరాడుతుంది. తురకపాలెం గ్రామ పరిస్థితులపై ప్రభుత్వం రిపోర్టు ఇవ్వాలి. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
తురకపాలెం ట్రాజెడీ.. సకాలంలో స్పందించకపోవడం వల్లే మృత్యుఘోష!
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో.. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో.. 45 మరణాలు సంభవించాయి. అధికారుల లెక్కలు ఎలా ఉన్నా.. ఏడాది కాలంలో 100 మంది చనిపోయారని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు గురువారం గ్రామంలో పర్యటించారు. ‘‘ఇవి సహజ మరణాలు కాదు అసహజ మరణాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంత వ్యవహారం జరుగుతున్న ఎందుకు కళ్ళు తెరవలేదు?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు?. జిల్లా మంత్రి లోకేష్ ఇప్పటిదాకా ఎందుకు పర్యటించలేదు?. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు?. ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే మరణాలు ఆగిపోయేవని.. ఇంతవరకు మరణాలకు సంబంధించి కారణాలు కనుక్కోలేకపోయారని మండిపడ్డారు. ఈ మరణాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. ప్రభుత్వం ఇకనైనా ప్రజల ప్రాణాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో సీపీఎం నేతలు ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై వివరాలు తెలుసుకున్నారు. వరుస మరణాలతో గ్రామంలో పరిస్థితి అదుపు తప్పింది. తమ ఊరికి బయటి నుంచి జనాలు కూడా రాలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వైద్యారోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. విషయం తెలిసిన తర్వాత కూడా వేగంగా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. విమర్శల నేపథ్యంలో.. మరణాలకు కారణాలేమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్యకళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులు, సాంకేతిక బృందం, వైద్యారోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్యశిబిరం నిర్వహించారు. మరణాలకు ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్ ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
తురకపాలెంలో 3 నెలల్లో 45 మంది మృత్యువాత
-
తురకపాలెంలో మరణమృదంగం..
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో కలరా బారినపడి అమాయకులు మృత్యువాత పడిగా, ఇప్పుడు గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో తాజాగా తలెత్తిన మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన మే నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో 45 మంది వరకూ మృత్యువాతకు గురయ్యారని సమాచారం అందుతుండగా, అధికారికంగానే ఈ సంఖ్య 30గా ఉంది. మృత్యువాతకు గురైన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ళలోపు వారే కావటం గమనార్హం. ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మరణాలు సంభవించినట్టు వైద్య శాఖ అనుమానిస్తోంది.ఎవరిపై ఎక్కువ ప్రభావం బర్ఖోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా సోకిన వారిలో ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. షుగర్, లివర్, కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి భారత్సహా దక్షిణ ఆసియాలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాలలో వర్షా కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు మొదలై క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణించి చివరకు ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణాలు సంభవిస్తాయి.తీవ్ర నిర్లక్ష్యం డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల కేసులు కొంత అనుమానాస్పదంగా నమోదయితే చాలు.. ఆ ప్రాంతంలో సర్వేలెన్స్ పెట్టి కేసులు నమోదుకు గల కారణాలను అన్వేíÙంచాలి. అలాంటిది పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రైవేట్ ఆస్పత్రిలో మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించిన 3వారాల అనంతరం ప్రత్యేక బృందాలను తురకపాలెంకు పంపి ప్రభుత్వం హడావుడి చేసింది. గ్రామంలో ఇప్పటికే 45 మంది మృతిచెందగా, 29 మంది బాధితుల నుంచి రక్తనమూనాలు తీసి గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్కు పంపారు. ఇన్ఫెక్షన్ నిర్ధారణకు బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం డీఎంహెచ్వో బృందం ప్రజల నుంచి రక్తనమూనాల సేకరించింది. క్షణ క్షణం.. భయం భయం ఈ గ్రామం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, బంధువులుసహా బయటి వ్యక్తులు ఎవ్వరూ గ్రామానికి రావడం లేదు. రాత్రి 8 దాటితే గ్రామంలో ఎవ్వరూ సంచరించడం లేదు.అతిసారంతో వృద్ధురాలి మృతి తిరుపతికి చెందిన సుభద్ర(75) ఆదివారం ఓ విందులో పాల్గొన్నారు. అనంతరం వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మరణించింది. విందులో పాల్గొన్న మరో 40 మంది కూడా ఆస్పత్రి పాలయ్యారు. రక్త నమూనాల పరీక్షల కోసం ఎదురుచూస్తున్నాం: వైద్య బృందం ఈ మరణాలు మెలియోడోసిస్ కారణంగా జరిగాయా లేదా అన్న విషయం శనివారంలోగా అందే రక్త నమూనాల పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. డాక్టర్ రఘునందన్ నేతృత్వంలోని వైద్య బృందం బుధవారం బాధిత గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రఘునందన్ ఏమన్నారంటే, ‘‘ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయోలజీ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలియోడోసిస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐవీ యాంటీబయోటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ బృందంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఇతర అధికారులు ఉన్నారు. వెల్దుర్తిలో ముగ్గురికి డెంగీ లక్షణాలు కర్నూలు జిల్లా వెల్దురిలో ఇటీవల డెంగీ బారిన పడి చిన్నారి మోక్షిత మృతి చెందగా.. తాజాగా మరో ముగ్గురిలో డెంగీ లక్షణాలు కనిపించాయి. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో 15వ వార్డు ఓవర్హెడ్ ట్యాంకు వద్ద ఏడాది చిన్నారి, అదే వార్డుకు చెందిన నిఖిల్.. 7వ వార్డుకు చెందిన ఇంటర్ విద్యార్థి డెంగీ లక్షణాలతో చేరారు.కారణాలు.. అనుమానాలు!» గ్రామంలో పారిశుధ్యం క్షీణించడం తాగునీరు కలుషితం కావడం » సమీప క్వారీల నుంచి వెలువడే దుమ్ము, ధూళి » నాసిరకం మద్యం వరుస మరణాలతో గ్రామంలోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మా ఊరికి అసలు చుట్టాలు రావాలంటేనే భయపడిపోతున్నారు. గ్రామంలో ఏం జరుగుతోందో అర్థం కావటంలేదు. మా కళ్లముందే బాగా తిరుగుతున్న వ్యక్తులు ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. – తురకా దాసు, తురకపాలెం గ్రామస్తుడు. -
తురకపాలెం గ్రామం ప్రత్యేకత ఇదే..
భారతీయ సంస్కృతిలో భాగమైన భిన్నత్వంలో ఏకత్వ భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామం. గ్రామంలోని ముస్లిం శిల్పకళాకారులు తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. తాము చేసే పనిలో దైవాన్ని చూస్తామంటున్నారు. తురకపాలెం గ్రామంలో అందరూ ముస్లింలే. ఇతర మతస్తులెవరూ లేరు. ఈ గ్రామానికి ఉత్తరం వైపున ప్రభుత్వ పోరంబోకు భూములు ఉన్నాయి. సదరు భూముల్లో లభించే బండరాతితో హిందువులు పవిత్రంగా భావించి దేవాలయాల్లో ప్రతిష్ఠించే ధ్వజస్తంభాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో, మాచవరం వంద కుటుంబాలకు ఇదే వృత్తి.. సుమారు వందేళ్ల క్రితం తురకపాలెం గ్రామానికి చెందిన కరీమ్ సాహెబ్ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. కరీమ్ సాహెబ్ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామంలో వందకుపైగా కుటుంబాలు ఈ కళనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. రూపుదిద్దుకున్న ధ్వజస్తంభం రాయిని శిల్పంగా మార్చి.. ధ్వజస్తంభం తయారు చేయాలంటే 10 మంది నుంచి 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి 30 నుంచి 40 రోజుల వరకు పని చేయాల్సి ఉంటుంది. మొదటగా రాయిని గ్రామంలోని కొంత మంది కార్మికులు కలిసి ఎన్నుకుంటారు. 20 అడుగుల నుంచి 50 అడుగుల ధ్వజస్తంభం తయారు చేయటానికి 800 నుంచి 1,200 పనిదినాలు కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. రాయిని శిల్పంగా మార్చి పవిత్రమైన ధ్వజస్తంభం తయారు చేసే సమయంలో వీరు ఎంతో నిష్టగా ఉంటారు. ధ్వజస్తంభం పూర్తయిన తర్వాత జాగ్రత్తగా లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత కూడా వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజస్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ఎంతో ఓపిక, నైపుణ్యంతో కష్టపడే వీరికి రోజుకు రూ.400 నుంచి రూ.600 మాత్రమే కూలి గిట్టుబాటు అవుతోంది. 30 ఏళ్లుగా ఇదే వృత్తి.. 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. అయితే ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. మిషన్లు రావటం వల్ల చేతితో తయారు చేసేవారికి అంతగా గుర్తింపు లేకుండా పోతోంది. – షేక్ షరీఫ్,ధ్వజస్తంభ తయారీదారుడు మా కళను గుర్తిస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు ధ్వజస్తంభం ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. – జాన్ వలీ, ధ్వజస్తంభ తయారీదారుడు ప్రభుత్వం సామాగ్రి అందిస్తే బాగుంటుంది.. ధ్వజస్తంభాలు తయారు చేసేందుకు ఉలి, సుత్తి, శ్రావణం, మలాట్, గడ్డపార లాంటి సామాగ్రి ఎంతో అవసరం. వీటిని కొనుగోలు చేయాల్సి వస్తే చాలా ఖర్చుతో కూడిన పని. మిగతా వృత్తుల వారికి ఏ విధంగా ప్రభుత్వం సామాగ్రి కోసం నగదు లేదా సామాగ్రిని అందిస్తోందో అదేవిధంగా మాకు కూడా సామాగ్రిని అందిస్తే బాగుంటుంది. – ఎగ్జాం వలి, ధ్వజస్తంభ తయారీదారుడు -
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
గుంటూరు రూరల్ : గుంటూరులో దారుణం జరిగింది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నలుగురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెను విషాదం...
గుంటూరు రూరల్, న్యూస్లైన్ :గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో శనివారం పెనువిషాదం చోటుచేసుకుంది. గ్రామంలో పాడుపడిన క్వారీ గుంత వద్ద దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి మృతిచెందారు. తొలుత ముగ్గురు అక్కచెల్లెళ్లలో అందరికన్నా చిన్నమ్మాయి నీటిలో పడగా, ఆమెను కాపాడడానికి ప్రయత్నించి ఇద్దరు అక్కలూ కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలో పడిపోయారు. తమను కాపాడండంటూ ఆ చిన్నారులు పెడుతున్న ఆర్తనాదాలు విని పరిసరాల్లో ఉన్న వారు అక్కడకు వచ్చి వారిని వెలికితీసేటప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలిలా ఉన్నాయి. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన మేరకు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన చల్లా శ్రీనివాసరావు, చల్లా జ్యోతి దంపతులు పొట్టకూటి కోసం పదేళ్ల కిందట గుంటూరు శివారు ప్రాంతంలోని తురకపాలెంకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు శిరీష(11) నీలిమ(8)మల్లేశ్వరి(5) ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు చినపలకలూరు క్వారీలోను, తల్లి జ్యోతి రాఘవరావు క్వారీలోనూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే భార్యాభర్తలిద్దరూ ఉదయం పనులకు వెళ్లారు. పిల్లలు ముగ్గురూ తమ దుస్తులు ఉతుక్కుని స్నానం చేసివచ్చేందుకు పాడుపడిన క్వారీ గుంట వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికి నీటిలో దిగుదామనుకునే లోపే వారిలో చిన్నమ్మాయి అయిన మల్లేశ్వరి(5) కాలు జారి గుంతలో పడింది. చెల్లిని కాపాడుకునేందుకు మల్లేశ్వరి చెయ్యి పట్టుకునే ప్రయత్నంలో రెండో అమ్మాయి నీలిమ(8) కూడా కాలు జారి నీళ్లలో పడిపోయింది. కళ్లముందు నీటిలో పడిపోయిన ఇద్దరు చెల్లెళ్లను ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దక్క శిరీష(11) కూడా నీటిలో దిగింది. అయితే ముగ్గురూ చిన్నపిల్లలే కావడం, వారికి ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ కాపాడండని ఆర్తనాదాలు చేశారు. వారి కేకలు విని అక్కడే దుస్తులు ఉతుకుతున్న ముక్కంటి ఈశ్వర్ కుమార్తె బత్తుల దుర్గా భవాని చూసి పక్క క్వారీలో పనిచేస్తున్న కార్మికులను పిలుచుకువచ్చింది. వారు వచ్చి గుంతలో నుంచి చిన్నారులను బయటకు తీశారు. అయితే అప్పటికే శిరీష, నీలిమ చనిపోయారు. చిన్నమ్మాయి మల్లేశ్వరి కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించడానికి రోడ్డుపైకి తీసుకువెళ్లేటప్పటికి ఆ చిన్నారి ప్రాణాలు కూడా ఆవిరైపోయాయి.ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు ఉరుకులు పరుగులపై ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు, తహశీల్దార్ కె.చెన్నయ్య సిబ్బందితో అక్కడకు చేరుకుని ఘటన జరిగిన క్వారీ గుంటను పరిశీలించారు. ఈ క్వారీ గత నాలుగేళ్లుగా వినియోగంలో లేదని స్థానికులు చెప్పారు. గతంలో ఈ క్వారీ పసుపులేటి సంజీవరావు ఆధ్వర్యంలో ఉండేదని వారు తెలిపారు. క్వారీ గుంట నిండా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు, ఈ గుంటలో నీటి ఊట కూడా వస్తుందని, చాలా లోతుగా ఉంటుందని చెప్పారు. ఎక్కువగా ట్రాక్టర్ డ్రైవర్లు ఈ క్వారీలో తమ ట్రాక్టర్లు శుభ్ర పరుచుకునేందుకు వినియోగిస్తుంటారన్నారు. పోలీసులు క్వారీ యజమానిపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. దేవుడు అన్యాయం చేశాడయ్యా... అల్లారు ముద్దుగా పెంచుకునే తమ ముగ్గురు మహలక్ష్ముల్లాంటి చిన్నారులను ఒక్కసారిగా తమకు లేకుండా చేసి దేవుడు అన్యాయం చేశాడంటూ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మేమెవరి కోసం బతకాలంటూ పెద్దపెట్టున రోదించారు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు, చుట్టుపక్కల వారు సైతం కంటతడిపెట్టుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు... క్వారీలు నడుపుతూ పాడుపడిపోయిన నీటి గుంట వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్వారీ యజమానిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వై.శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. క్వారీల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా ఉన్నతాధికారులకు నివేదిక సిద్ధం చేసి చట్టపర మైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల కుటుంబానికి ఎమ్మెల్యే రావెల పరామర్శ ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్బాబు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటిపర్యంతం అవుతున్న చిన్నారుల తల్లి, దండ్రులను ఓదార్చారు. క్వారీలో పాడుపడిన నీటి గుంట ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. ప్రభుత్వం నుంచి మృతిచెందిన చిన్నారుల కుటుంబానికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చిన్నారుల అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి 20 వేల రూపాయలను అందజేశారు.