రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే..
విజయవాడ(మొగల్రాజపురం) రక్తదానం చేస్తే ప్రాణదానం చేసిన ట్లేనని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ అన్నారు. సిండికేట్ బ్యాంక్ 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం పి.బి.సిద్ధార్థ కళాశాల ఆవరణలోని స్పోర్ట్స్ ఆడిటోరియంలో‡రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. బ్యాంకులు తమ వ్యాపార లావాదేవీలతోపాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ సమరం మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా మంచి కార్యక్రమమని, లేనిపోని అపోహలను నమ్మవద్దని అన్నారు. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. సిండికేట్ బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో 3800 బ్రాంచిలతో రూ.4.75 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని రక్తాన్ని సేకరించారు. బ్యాంకు సిబ్బందితోపాటుగా కొంతమంది ఖాతాదారులు, సిద్ధార్థ కళాశాల విద్యార్థులు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ ఆధ్వర్యంలో సిద్ధార్థ మైదానంలో వాకింగ్ చేస్తున్న వారికి బ్యాంక్ ఆధ్వర్యంలో బి.పి, షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు.