volcanologist
-
తరుముకొస్తున్న ఉత్పాతం
అమెరికాలో అతి పెద్దదైన కిలోవెయా అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. విస్ఫోటనం ధాటికి అగ్నిపర్వతం నుంచి ఏకంగా 80 మీటర్ల ఎత్తుకు పైగా లావా ఎగసిపడుతోంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అతి త్వరలో అంతకు మించి భారీ స్థాయిలో అగ్నిపర్వత విస్ఫోటం తప్పకపోవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ‘‘అదెక్కడన్నది ఇప్పటికిప్పుడు స్పష్టం కావడం లేదు. కానీ ముప్పు పొంచి ఉందన్నది మాత్రం సుస్పష్టం’’అని చెబుతున్నారు. దాని దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమస్యలు మొదలుకుని ఆహార కొరత దాకా మానవాళికి కొన్నేళ్ల పాటు అన్నివిధాలా కనీవినీ ఎరగని కష్టనష్టాలు తప్పకపోవచ్చంటున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూలన జరిగే అగ్నిపర్వత పేలుడు మొత్తం ప్రపంచాన్ని ఇంతగా ఎలా ప్రభావితం చేస్తుందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా పచ్చి నిజమిది’’అని సైంటిస్టులు చెబుతున్నారు...! అది 1815. ఇండోనేసియాలోని మౌంట్ తంబోరా అగ్నిపర్వతం ఉన్నట్టుండి బద్దలైంది. ఎంతలా అంటే, మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అతి భారీ విస్ఫోటంగా అది రికార్డుల్లో నిలిచిపోయింది. ఆ తీవ్రత ధాటికి భారీ పరిమాణంలో ఎగిసిపడ్డ దుమ్ము, ధూళి రేణువులు తదితరాలు వాతావరణంలో కిలోమీటర్ల ఎత్తున, అత్యంత విస్తారంగా పరుచుకుపోయాయి. భూమిని చేరే సూర్యరశ్మిని అవి అడ్డుకున్నాయి. దాంతో ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు ఏకంగా ఒక డిగ్రీకి పైగా పడిపోయాయి. ఆ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కడా వేసవే లేకుండా పోయింది. ఫలితంగా వానలు ముఖం చాటేయడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గిపోయింది. దేశాలకు దేశాలే తిండికి అలమటించిపోయాయి. ఎటు చూసినా కరువు మరణాలే అన్నట్టుగా తయారైంది. వాతావరణ మార్పుల కారణంగా కలరా వంటి మహమ్మారులు విజృంభించి మరింత భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఇదంతా కేవలం ఒకే ఒక్క అగ్నిపర్వత విస్ఫోటం చేసిన నష్టం. అందుకే, త్వరలోనే అలాంటి విస్ఫోటానికి ప్రకృతి రంగం సిద్ధం చేసుకుంటోందన్న జియాలజిస్టుల హెచ్చరికలు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకు ఆరింట ఒక శాతం అవకాశమున్నట్టు జెనీవా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త మార్కస్ స్టొఫెల్ అంచనా వేశారు. ‘‘ఈసారి జరగబోయే పర్యావరణ విధ్వంసం అంచనాకు కూడా అందనిది. పైగా ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ప్రణాళికా లేకపోవడం మరింత గుబులు పుట్టించే అంశం’’అంటూ వాపోయారు. అంతేకాదు, ‘‘1815తో పోల్చుకుంటే ఈసారి జరగబోయే నష్టం అంచనాలకు కూడా అందని స్థాయిలో ఉంటుంది’’అని అభిప్రాయపడ్డారు. ఏం జరుగుతుంది? అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భారీగా లావాను వెదజల్లుతాయన్నది తెలిసిందే. దాంతోపాటు అత్యంత భారీ పరిమాణంలో బూడిదతో పాటు పలు రకాల వాయువులు కూడా విడుదలవుతాయి. వాటిలో సల్ఫర్ డయాక్సైడ్ చేసే హాని అంతా ఇంతా కాదు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఏకంగా వాతావరణానికి మాతృ స్థానమైన ట్రోపోస్పియర్ దాకా చేరుతుంది. దాని దిగువన, అంటే భూమికి దాదాపు 7 మైళ్ల ఎత్తున ఉండే స్ట్రాటోస్పియర్లో భారీగా పరుచుకుని ఏరోసెల్ అణువుల పుట్టుకకు దారితీస్తుంది. అవి సూర్యరశి్మని అడ్డుకుని దాన్ని భూమికి చేరకుండా అంతరిక్షంలోకే తిప్పి పంపుతాయి. ఫలితంగా భూమి చల్లబడుతుంది. ఈ అణువులు కనీసం రెండేళ్లపాటు వాతావరణంలో అలాగే ఉండిపోతాయి. 1991లో ఫిలిప్పీన్స్లో మౌంట్ పినాటుబో అగ్నిపర్వత పేలుడు వల్ల దాదాపు 1.5 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైందని అంచనా. దాని దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణం 0.5 డిగ్రీ సెల్సియస్ మేరకు చల్లబడిపోయింది. 1815 తరహావి, అంతకు మించిన భారీ అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తే భూమి ఏకంగా 1.5 డిగ్రీల దాకా చల్లబడిపోయే ఆస్కారముంది. అదే జరిగితే ఈసారి నష్టతీవ్రత మరింత భారీగా ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ రాంపినో అన్నారు. ‘‘ప్రస్తుతం రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అందుకు కారణం. వేడి వాతావరణంలో ఏరోసెల్ అణువులు మరింత చిన్న పరిమాణంలో ఏర్పడతాయి. దానికి తోడు వాతావరణపు పై పొరల్లో శరవేగంగానూ, సుదూరాలకూ పయనిస్తాయి. దాంతో సూర్యరశి్మని అవి మరింత ఎక్కువగా అడ్డుకుని భూ వాతావరణాన్ని గణనీయంగా చల్లబరుస్తాయి’’అని వివరించారు. గ్లోబల్ వారి్మంగ్తో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది మంచిదే కదా అనిపించడం సహజం. కానీ ఇది మరీ విపత్కర పరిణామాలకు బాటలు వేస్తుందని రాంపినో హెచ్చరించారు. ‘‘క్రీస్తుపూర్వం 43లో అలస్కాలోని ఓక్మోక్ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దక్షిణ యూరప్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 7 డిగ్రీల సెల్సియస్ దాకా పడిపోయాయి. ఆ దెబ్బకు ఆహారోత్పత్తి దాదాపుగా పడకేసింది. ఆ ప్రాంతాల్లోని దేశాలన్నీ నరకం చవిచూశాయి. నాటితో పోలిస్తే ఇప్పుడు జనాభా ఊహాతీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 80 కోట్ల పైచిలుకు జనాభా చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాలకు కేవలం 60 మైళ్ల దూరంలోనే విస్తరించి ఉంది’’ అని చెప్పారాయన. ‘‘కనుక చల్లని వాతావరణం ప్రపంచ ఆహారోత్పత్తిలో కీలకపాత్ర పోషించే భారత్తో పాటు అమెరికా, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దేశాలన్నీ ఆహార సంక్షోభంతో అల్లాడుతాయి’’అని ఆందోళన వెలిబుచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విచిత్ర కొలువులు!
‘కూటి కోసం కోటి’ విద్యలు అన్నారు పెద్దలు.. అదే సూత్రం ఆధారంగా ఈ ప్రపంచంలోని ఉన్న అందరూ ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరూ ఒకే రకమైన ఉద్యోగం చెయ్యరు, చెయ్యలేరు. కానీ, అన్ని రకాల పనులు జరిగితేనే ఈ ప్రపంచం మనుగడ సాధిస్తుంది. కొందరికి సులభమైన ఉద్యోగం దొరుకుతుంది. మరికొందరికి చాలా కష్టపడాల్సిన ఉద్యోగం రావచ్చు. మరికొందరు మీరు ఇంతకముందెప్పుడూ వినని ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. అలాంటి భిన్నమైన ఉద్యోగాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! వాసనను గుర్తు పట్టడం రుచికరమైన భోజనం వండుతున్నా.. కుళ్లిన దుర్గంధం వెలువడ్డా..మన ముక్కు వెంటనే గుర్తిస్తుంది. ఇలాంటి వాసనలను కూడా గుర్తుపట్టే ఉద్యోగం కూడా ఉంటుందని మీకు తెలుసా? ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే. కంపెనీలు అధిక మొత్తంలో వేతనాలు ఇచ్చి మరీ వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటాయి. కంపెనీల ఉత్పత్తులను వాసనలు చూసి వాటిపై అభిప్రాయాన్ని చెప్పడం వీరి ప్రధాన విధి. టూత్పేస్ట్, ఔషధాలు, షాంపులు తదితర ఉత్పత్తుల్లో సువాసనలు కంపెనీలు జోడిస్తాయి. ఈ ఉద్యోగులు వాటి వాసన చూసి తగు మోతాదులో ఉందా? లేదా? అన్నది కంపెనీలకు వివరించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయ్యాలంటే రసాయనిక శాస్త్రంపై తగిన పట్టు ఉండాలి. కంపెనీ దీర్ఘకాల ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకోని వీరు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. క్రైం జరిగిన ప్రదేశాన్ని శుభ్రపరిచడం హత్య జరిగిన ప్రదేశాలను చూస్తేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. కానీ అలాంటి ప్రదేశాలను శుభ్రపరిచే ఉద్యోగులు కూడా ఉంటారు. హత్యా ప్రదేశాలు, పరిశ్రమలలో ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలలో వాటిని శుభ్రపర్చడం వీరి ప్రధాన విధి. వీరంతా ఆ స్థలంలో ఉన్న రక్తం ఆనవాళ్లు, శవాలను తొలగిస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో హత్య జరిగి రోజులు లేదా నెలలు గడిచి శరీరం కుళ్లిపోయినా కూడా శవాలను తొలగించి ఆ ప్రదేశాలను శుభ్రపర్చాల్సి ఉంటుంది. తీవ్రమైన దుర్వాసన వస్తున్నా కూడా వీరు తమ విధిని నిర్వర్తిస్తారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఉద్యోగులు ఇనెఫెక్షన్ల బారిన పడి అనారోగ్యానికి గురౌతుంటారు. తీవ్ర భయానక పరిస్థితులు ఉండే క్రైం జరిగిన ప్రదేశాలను శుభ్రపర్చాలంటే మానసిక స్థైర్యం, రసాయన శాస్త్రంలో తగినంత జ్ఞానం కలిగి ఉండాలి. వోల్కనాలజిస్ట్ అగ్నిపర్వతాల మీద పరిశోధనలు చేసేవారిని వోల్కనాలజిస్టులు అంటారు. భయంకరమైన అగ్నిపర్వతాల వద్ద వీరు పనిచేయాల్సి ఉంటుంది. చల్లారిపోయిన అగ్నిపర్వతాలను వీరు పరిశోధిస్తారు. అందులో నుంచి వెలువడిన వివిధ వాయు, ఘన పదార్థాలను వీరు శోధిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఉద్యోగం. అగ్నిపర్వతాల నుంచి ఆకస్మికంగా విషవాయువులు వెలువడుతుంటాయి. వాటిని పొరబాటున పీల్చినా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. కానీ, సవాళ్లంటే ఇష్టపడే వ్యక్తులు ఈ ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావడం విశేషం. ఇక్కడ వచ్చే ధ్వనులు, వెలువడే వివిధ వాయువులు, అగ్నిపర్వతం పేలడానికి గల కారణాలను తెలుసుకొనేందుకు వీరు పరిశోధన జరుపుతారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ నిండితే క్లీనర్స్ ద్వారా దాన్ని శుభ్రపరుస్తాం. అన్ని ఉద్యోగాల్లా దీన్ని కూడా తమ వృత్తిగా భావించి ఉద్యోగాలు చేస్తుంటారు. తీవ్రమైన దుర్గంధంతో కూడిన చెత్తను సెప్టిక్ ట్యాంక్నుంచి వీరు తొలగిస్తారు. అవసరమైతే వీరు సెప్టిక్ ట్యాంకులోకి దిగి పనిచేయాల్సి ఉంటుంది.ఈ పనిచేస్తున్నప్పుడు అనేక ఇ¯ŒSఫెక్షన్లు వచ్చి అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో సెప్టిక్ ట్యాంక్లో విడుదలయ్యే వివిధ రకాల గ్యాస్ల వల్ల అందులోకి దిగినవారు మరణించే పరిస్థితులు కూడా నెలకొంటాయి. ( సాక్షి స్కూల్ ఎడిషన్)