భవానీ దీక్షలకు స్వాగతం
నేటి నుంచి భవానీ దీక్షల స్వీకరణ
ఇంద్రకీలాద్రిపై మాల ధరించనున్న 25వేల మంది భక్తులు
డిసెంబర్ 12-16 వరకు దీక్ష విరమణ
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న దుర్గగుడి అధికారులు
అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తూ.. అమ్మకు నిత్య పూజాకైంకర్యాలు సమర్పిస్తూ.. ఆనంద జ్యోతులు వెలిగించే భవానీ దీక్షకాలం నేటి (ఆదివారం) నుంచి ప్రారంభంకానుంది. మండలకాలం పాటు అమ్మను భక్తితో పూజించే భవానీ మాల ధరించడం పుణ్యకార్యమని, పూర్వజన్మ సుకృతమని పండితులు చెబుతారు. ఎవరైతే నిత్యం దుర్గమ్మ నామస్మరణతో మనసును దైవాధీనం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారో వారే జగజ్జనని అనుగ్రహం పొందుతారని పేర్కొంటారు.
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల స్వీకరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఆరు లక్షలమంది భవానీలు దీక్షలు స్వీకరించేందుకు సన్నద్ధమయ్యూరు. దీక్షల స్వీకరణ ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు జరుగుతుంది. డిసెంబరు 12 నుంచి 16వ తేదీ వరకు దీక్ష విరమణ జరుగుతుందని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన వైదిక కమిటీ ప్రకటించింది.
దీక్షలు సాగేదిలా..
మండల దీక్షలు ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు, అర్ధమండల దీక్షలు 22 నుంచి 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ భక్తులంతా వచ్చేనెల 12 నుంచి 16వ తేదీలోగా ఇంద్రకీలాద్రికి వచ్చి దీక్షలు విరమించాలి. ఈ సమయంలో ఆలయంలో చండీయూగం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో కలశజ్యోతి ప్రదర్శన నిర్వహిస్తారు. డిసెంబర్ ఐదోతేదీ పౌర్ణమినాడు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణక్షేత్రం నుంచి ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 దీక్షల విరమణకు ఆఖరు రోజు కావడంతో అదేరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు.
విస్తృత ప్రచారం
ఉత్తరాంధ్ర భక్తులు భవానీ దీక్షలు ఎక్కువగా స్వీకరిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు మండలకాలం పాటు కఠోర నియమాలతో దీక్షలు పాటిస్తారు. అనంతరం కాలినడకన దుర్గమ్మ దర్శనానికి వస్తారు. ఈ భక్తుల కోసం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ప్రచార రథం ద్వారా గత నెలలోనే అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
హుదూద్ ప్రభావం ఎంత?
ఈ ఏడాది హుదూద్ తుపానుకు ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోరుుంది. ఈ నేపథ్యంలో సర్వం కోల్పోయిన భక్తులు దీక్షలు ఎంతమేరకు తీసుకుంటారోనన్న సందేహం వ్యక్తమవుతోంది. అరుుతే, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదురొడ్డి నిలబడిన భక్తులు అకుంఠిత భక్తితో అమ్మవారి దీక్షలు స్వీకరిస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
25వేల మంది భవానీ భక్తుల రాక
కేవలం జిల్లాలోని భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల్లోని వారు కూడా భవానీదీక్షలు స్వీకరించేందుకు ఇంద్రకీలాద్రి వస్తారు. దేవస్థానంలోని అర్చకుల వద్ద సుమారు 10వేల మంది, ఇంద్రకీలాద్రిపై సుమారు 500 మంది, గురుస్వాముల ఆధ్వర్యంలో మరో 15వేల మంది భక్తులు దీక్షలు స్వీకరిస్తారని అంచనా. ఐదు రోజులు సాగే ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భవానీ దీక్ష మండపంలో ఆదివారం ఉదయం అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించి.. అనంతరం మండపారాధన, కలశస్థాపన చేస్తారు. ఆ తరువాత భవానీ దీక్షల స్వీకరణ ప్రారంభమవుతుంది. మాలధారణ అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్య వి.శివప్రసాద్ మాట్లాడుతూ దీక్షలు స్వీకరించే భక్తులకు నియమాలను తెలియజేస్తామని, వారి సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు.