ఆమ్వే సీఈవో విలియం స్కాట్ పింక్నీ అరెస్ట్
కర్నూలు : ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఇండియా చైర్మన్ విలియం స్కాట్ పింక్నీ మరోసారి అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో ఆయనను కర్నూలు పోలీసులు గుర్గావ్లో అదుపులోకి తీసుకున్నారు. విలియం స్కాట్ పింక్నీపై కర్నూలు జిల్లాలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమ్వే సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
గుర్గావ్లోని ఆమ్వే కేంద్ర కార్యాలయంలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను అరెస్ట్ కావటం ఇది రెండోసారి. 2013లోనూ స్కాట్ పింక్నీతో పాటు ఆసంస్థకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను(అన్షు బుధ్రాజా, సంజయ్ మల్హోత్రా) కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) చట్టం నిబంధనల ఉల్లంఘన కింద 2011లో వాయనాడ్ క్రైమ్ బ్రాంచ్లో వీరిపై 3 కేసులు నమోదయ్యాయి. విలియం స్కాట్ పింక్నీపై దేశవ్యాప్తంగా పలు కేసులున్నాయి. మరోవైపు ఆమ్వే సంస్థ మాత్రం తాము చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకోవటం విశేషం. మరికాసేపట్లో పింక్నీని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.