woman disappears
-
సరోగసీ మహిళ అదృశ్యం
హైదరాబాద్: అద్దె గర్భాన్ని ధరించేందుకు సంతాన సాఫల్యతా కేంద్రానికి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ ఘటనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసీ పద్ధతిలో అద్దె గర్భం దాల్చేందుకు మహిళలు కావాలంటూ ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్ సమిత్ శేఖర్ అలియాస్ డాక్టర్ సాయి కిరణ్ నుంచి నరేశ్కుమార్కు మెసేజ్ వచ్చింది. దీంతో తమ బంధువైన విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన లక్ష్మి(31)ని ఈ ఏడాది సెప్టెంబర్లో తీసుకొచ్చి ఒప్పందం మేరకు ఇక్కడ ఉంచి సంబంధిత ధ్రువపత్రాలపై సంతకాలు కూడా చేశారు. అద్దె గర్భం ధరిస్తే రూ. 2.50 లక్షలు ఇస్తారంటూ చెప్పడంతో పేదరికంలో ఉన్న లక్ష్మి ఇందుకు అంగీకరించింది. అప్పటి నుంచి వారి సంరక్షణలో ఉన్న లక్ష్మి వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు దాచిపెట్టాయి. ఆమెను చూడటానికి వచ్చిన నరేశ్ రెండుసార్లు కలవడానికి యత్నించగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. లక్ష్మి కనిపించడం లేదంటూ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాలతో వైద్యాధికారులు సాయికిరణ్ ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేపట్టడంతోపాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి బుధవారం ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల విధులకు వెళ్లి.... అదృశ్యమైంది
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించడానికి వచ్చి న ఓ మహిళా ఉపాధ్యాయురాలు అదృశ్యమైంది. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. వన్టౌన్ అదనపు ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్లోని సందీప్నగర్కు చెందిన వివాహిత దురువ శైలజ అదే మండలంలోని మోవాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు బెల్లంపల్లిలోని రాంనగర్ పోలింగ్ కేంద్రంలో డ్యూటీ వేశారు. ఈ మేరకు శైలజ గత నెల 29న తోటి ఉద్యోగులతో కలిసి వచ్చి 30న ఎన్నికల విధులు నిర్వర్తించింది. అదే రోజు సాయంత్రం తన తల్లి విజయలక్ష్మీతో సెల్ఫోన్లో మాట్లాడింది. సాయంత్రం 6 గంటల తర్వాత విధులు ముగించుకుని ఎవరికీ కనిపించకుండా పోయింది. ఎన్నికల విధులకు వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో శైలజ తల్లిదండ్రులు మిత్రులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో శైలజ తండ్రి దురువ శంకర్ గురువారం రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.