World Sight Day
-
వరల్డ్ సైట్ డే 2021: మీ కళ్లను ప్రేమించండి!
సాక్షి, హైదరాబాద్: మనిషికి ప్రకృతి అందించిన అత్యంత అందమైన బహుమతి, గొప్ప వరం కళ్ళు. అందుకే సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. ఒక్కపది నిమిషాలు కళ్లుమూసుకుని లోకానికి చూడడానికి ప్రయత్నిస్తే వీటి విలువ మనకు అర్థమవుతుంది. దృష్టి లోపం, అంధత్వం, దృష్టి సంబంధిత సమస్యల గురించి అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం వరల్డ్ సైట్ డే ను జరుపుకుంటారు. ఈ క్రమంలో లవ్ యువర్ ఐస్ అనే నినాదంతో ఈ ఏడాది అక్టోబర్ 14న ఈ డే జరుపుకోవాలని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రకటించింది. 2000 సంవత్సరంలో, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చెందిన సైట్ ఫస్ట్ క్యాంపెయిన్ ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ విజన్ గ్లోబల్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొని, తమ కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిస్తోంది. 2030 నాటికి సభ్య దేశాలు రెండు కొత్త ప్రపంచ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. రిఫ్రాక్టెవ్ ఎర్రర్స్ నివారణలో 40 శాతం వృద్ధిని, కంటిశుక్లం శస్త్రచికిత్సల కవరేజీలో 30శాతం పెరుగుదల సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా భవిష్యత్తులో కంటి సంరక్షణలోనూ నాణ్యమైన సేవలను అందించడంలో కూడా కీలక పాత్ర పోషించాలని భావించాయి. కొందరికి పుట్టుకతోనే దృష్టి లోపాలొస్తే మరి కొందరికి వయసు రీత్యా ఏర్పడతాయి. ఈ రెండింటితోపాటు ప్రస్తుత జీవన పరిస్థితుల్లో మానవ నిర్లక్ష్యం కూడా కారణమని నిపుణులు చెబుతున్న మాట. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది నివారించగల దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అంతేకాదు ప్రపంచంలో 80 శాతం మందిని అంధత్వంనుంచి నివారించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక బిలియన్ ప్రజలు దగ్గరి లేదా దూరపు చూపు మందగింపు (మయోపియా లేదా హైపర్ మెట్రోపియా) సమస్యతో బాధపడుతున్నారు. ఇది నివారించగలిగే సమస్య. పిల్లలు, యువకులు, వృద్ధుల వరకు అందరూ ఈ సమస్యలతో బాధ పడుతుండగా,మెజారిటీ 50 ఏళ్లు పైబడిన వారు ఇందులో ఉన్నారు. ఇన్ఫెక్షియస్ కంటి జబ్బులు, దెబ్బలతోపాటు కంటి శుక్లం, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సు పెరిగే కొద్దీ వ్యక్తి దృష్టిని ప్రభావితం చేస్తాయి. వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కనీస జాగ్రత్తలు, కొన్ని సాధారణ చికిత్సలతో చాలా దృష్టి లోపాలను నివారించవచ్చు. కాలుష్యం, ప్రమాదాలు, విటమిన్ల లోపం, రసాయన పరిశ్రమల కార్మికులు, ఎక్కువ సేపు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లపై గంటల తరబడి పనిచేయడం వల్ల కూడా కంటిచూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది. అయితే ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు, శ్రద్ధ అవసరం. దురదృష్టవశాత్తు మనలో చాలా మంది లేదా ప్రతి రెండో లేదా మూడో వ్యక్తి ఏదో ఒక రకమైన కంటి సమస్య లేదా వ్యాధులతో బాధపడుతున్నారని అనుకుందాం. వాటిలో కొన్ని అంత తీవ్రంగా ఉండకపోయినా, కొన్ని మాత్రం చాలా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ముందస్తు పరీక్షలు అవసరం. కంటి ఆరోగ్యం, ఆహారం, జాగ్రత్తలు కంటి ఆరోగ్యంకోసం ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, క్యారెట్ వంటి ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ధూమపానాన్ని మానుకోవాలి. లేదంటే కంటి శుక్లాలు, కంటి నరాలు దెబ్బ తినడంతోపాటు అనేక దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి. అధిక ఎండనుంచి రక్షించుకునేందుక యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. ఒకవేళ ప్రమాదకరమైన కెమికల్స్ లేదా పనిముట్లతో పనిచేస్తున్నట్టయితే కంటిరక్షణకు సంబంధించిన కళ్లజోడు ధరించాలి. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడిపితే కళ్లు పొడిబారిపోతాయి. దీనికి నివారణకు ఎక్కువ సార్లు కళ్లను మూస్తూ తెరుస్తూ (బ్లింక్) ఉండేలా చూసుకోవాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. అధికంగా స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మాత్రలు వాడడం ఇందుకు ముఖ్య కారణం. అలాగే పిల్లల్లో వచ్చే కంటి సమస్యల నివారణకు మంచి పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, రోజులో కనీసం గంట అయినా వారిని సూర్యరశ్మి తగిలేలా ఆరు బయట ఆడుకునేలా చూడాలి. నేత్రదానం వీటితోపాటు మరింత ముఖ్యమైనది నేత్ర దానం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి నేత్ర దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించ వచ్చు. తద్వారా అనేక మంది చూపు లేని వారికి మేలు జరుగుతుంది. మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ఇపుడే ఐ డొనేషన్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం. -
సైట్ డే కార్యక్రమంలో పాల్గొన్న రామ్చరణ్
-
ఐ క్యాంప్ నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి
-
నేడు వరల్డ్ సైట్ డే
-
దృష్టి సారిస్తే మేలు..
- పెరుగుతున్న కంటిలోపాలు - పౌష్టికాహారం,ఏ-విటమిన్ లోపంతోనే.. - జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దూరం - నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం ఆదిలాబాద్ రిమ్స్ : ఆకాశం నీలంగా ఉందని తెలిసేదెలా..! అడవి పచ్చదనాన్ని సంతరించుకుందని గుర్తించేదెలా..! అందమైన జీవితాన్ని తనివితీరా చూసేదెప్పుడు.. ! జన్మనిచ్చిన అమ్మనాన్నలను ప్రత్యక్షంగా వీక్షిచడంమెలా..! ఇవన్నీ సాధ్యం కావాలంటే కంటి చూపు అవసరం. అందుకే నయనం ప్రధానం అంటారు. ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు మనిషి కంటి జబ్బులకు గురవుతున్నారు. శాశ్వత చూపులేని వారు కొందరైతే.. దృష్టిలోపంతో మరికొందరు ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. నయనం ప్రధానం.. మానవ శరీరంలో అన్ని అవయవాలకంటే కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కంటిచూపు లేకుంటే జీవితమే అంధకారం అవుతుంది. చాలామందికి విటమిన్-ఏ లోపం, పౌష్టికాహార లేమి, ఇన్ఫెక్షన్, మిస్సల్స్ ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్ల దృష్టి లోపం ఏర్పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో పుట్టిన పదో నెల నుంచి ప్రతీ ఆరు నెలలకోసారి విటమిన్-ఏ మందును ఐదేళ్లు వచ్చేదాకా తొమ్మిది డోసులు క్రమం తప్పకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల పేదలకు అవగాహన లోపంతో ఎటువంటి కంటి సమస్యలు వచ్చినా వైద్యులను సంప్రదించకపోవడంతో వారి పిల్లల్లో దృష్టిలోపం ఏర్పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. అతి సున్నితమైన కళ్లపై నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. జిల్లాలో చికిత్స నిర్వహించే ఆస్పత్రులు.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రితోపాటు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ కింద మంచిర్యాలలోని సుఖి భోగి సేవా సమితి, బీవీఆర్ చారిటబుల్ కంటి ఆస్పత్రి, బెల్లంపల్లిలోని చారిటబుల్ లయన్స్ ఐ హాస్పిటల్, ఆదిలాబాద్లోని శ్రీసాయి నేత్రసేవా వెల్ఫేర్ సొసైటీ, ఆదిలాబాద్ మండలం మావలలోని శేషవ చెన్నవార్ ఐ హాస్పిటల్, ముథోల్లోని బోస్లే గోపాల్రావ్ ఐ హాస్పిటల్లో స్వచ్ఛందంగా కంటి చికిత్స నిర్వహిస్తారు. ఈ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు చేస్తారు. ఆపరేషన్ల అనంతరం కళ్ల జోళ్లు అందజేస్తారు. సకాలంలో గుర్తించపోవడంతోనే... పిల్లల్లో కంటి జబ్బులను సకాలంలో గుర్తించకపోవడంతోనే దృష్టిలోపం అధికమవుతోంది. వంశపారపర్యం, పౌష్టికాహారం లోపం, కంప్యూటర్లు, టీవీల ముందు, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాలతో పిల్లల్లోనూ దృష్టిలోపాలు పెరుగుతున్నాయి. ముందుగా పిల్లలు తలనొప్పితో బాధపడుతారు. బోర్డు సరిగా కనిపించదు, ఇంట్లో టీవీని దగ్గరగా వెళ్లి చూస్తారు. వీరిలో క్రమంగా మెల్ల కన్ను వస్తుంది. చిన్న వయసులోనే పరీక్షలు చేసి అద్దాలు వాడకపోతే ఐదేళ్లలోపు అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. సాయంత్రం 5 గంటలు దాటితే వీరికి కళ్లు సరిగ్గా కనిపించవు. ఇలాంటి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం పరీక్షలు చేసి అవసరమైతే అద్దాలు మారుస్తూ ఉండాలి. 18 ఏళ్ల తర్వాత లేజర్ చికిత్స ద్వారా ఆపరేషన్ చేసి దృష్టి లోపాన్ని సవరిస్తారు. ఆ తర్వాత అద్దాలు వాడే అవసరం ఉండదు. జాగ్రత్తలు పిల్లల్లో దృష్టిలోపం రాకుండా 9 నెలల వయసులోనే విటమిన్-ఏ అందించాలి. పదునైన వస్తువులతో పిల్లలు ఆడుకోవద్దు. ఆకు కూరలు అధికంగా పెట్టాలి. క్యారెట్, గుడ్లు, పాలు, యాపిల్, పౌష్టికాహారం తీసుకోవాలి. కంటికి ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. చిన్న వయసులోనే ఎక్కువగా టీవీ చూడకూడదు. మరీ దగ్గరగా కూర్చోకుండా టీవీకి 10 అడుగుల దూరంలోంచి టీవీ వీక్షించాలి. గదిలో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో టీవీని వీక్షించకూడదు. ఒకవేళ చీకట్లో టీవీ వీక్షిస్తే నేరుగా కంటిపై టెలివిజన్ వెలుతురు పడి దృష్టిలోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధ వహించాలి.. కంటి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు పాటించాలి. ఏ-విటమిన్, పౌష్టికాహార లోపం వలన దృష్టిలోపం సంభవిస్తుంది. విద్యార్థులకు స్వచ్ఛమైన ఆకుకూరలు, గుడ్లు, పాలు ఎక్కువ మోతాదులో అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపంతో కంటి పరీక్షలు చేసుకోరు. దీనివల్ల కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పుట్టకతో, వంశపారపర్యంగా, మెల్లకన్ను ఉన్న వారికి దృష్టిలోపం సంభవిస్తుంది. - లింగేష్, అప్తాల్మిక్ ఆఫీసర్, రిమ్స్