● బదిలీ అయినా రిలీవ్ కాని అధికారి ● విధుల్లో చేరని కొత్త ఆఫీసర్ ● ఇప్పటికే నెల దాటిన వైనం.. ● హాట్టాపిక్గా ‘డీపీవో’ వ్యవహారం
కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ శాఖలో కుర్చీపై పేచి నెలకొంది. జిల్లా పంచాయతీ అధికారి గా పనిచేస్తున్న ఎస్.శ్రీలతను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో నిర్మల్ డీఎల్పీవోగా పనిచేస్తున్న జి. రమేశ్ను నియమించింది. ఈ ఉత్తర్వులు వచ్చి నెల దాటినా కొత్త అధికారి విధుల్లో చేరకపోవడం, ప్రస్తుత అధికారి విధుల నుంచి రిలీవ్ కాకపోవడంపై సొంత శాఖతో పాటు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విధుల్లో చేరేందుకు నిర్మల్లో రిలీవై వచ్చిన అధికారిని చేర్చుకోకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీపీవో బదిలీ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఏం జరిగిందటే..
గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో ప్రభుత్వం పలువురు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా ఆదిలాబాద్ డీపీవోగా పనిచేస్తున్న ఎస్.శ్రీలతను బదిలీ చేసిన ప్రభుత్వం పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించింది. ఆమె స్థానంలో నిర్మల్ డీఎల్పీవోగా పనిచేస్తున్న రమేశ్ను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆ ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసింది. నిర్మల్ డీఎల్పీవోగా ఉన్న రమేశ్ను రీడిప్లాయిమెంట్ కింద పంచాయతీ అధికారిగా నియమిస్తూ మరోసారి ఫిబ్రవరి 25న ఆ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన గత నెల 27న నిర్మల్లో డీఎల్పీవోగా రిలీవై జిల్లాకు వచ్చారు. విధుల్లో చేరేందుకోసం కలెక్టర్ను మర్యాదపూర్వంగా కలిశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆగాలని కలెక్టర్ సదరు అధికారికి సూచించినట్లు సమాచారం.
నెల రోజులుగా ఖాళీగానే..
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెల 8వ తేదీతో ముగిసింది. అయినప్పటికీ రమేశ్ను జిల్లాలో విధుల్లో చేర్చుకోలేదు. అటు నిర్మల్లో డీఎల్పీవోగా రిలీవ్ కావడం, ఇటు డీపీవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేకపోవడంతో ఆయన నెల రోజులుగా ఏ పోస్టు లేకుండా ఖాళీగానే ఉంటున్నారు. అయితే సదరు అధికారిని విధుల్లో చేర్చుకునేందుకు ఉన్నతాధికారి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో బదిలీ అయినా రిలీవ్ కాకుండా పాత డీపీవోనే ఆ శాఖ పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన ‘క్షయ ముక్త్భారత్’ కార్యక్రమ శిక్షణకు సైతం సదరు అధికారే వెళ్లి వచ్చారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్న సమయంలో పంచాయతీ కార్యాలయ ఏవోగా పనిచేసిన రమేశ్కు జిల్లాపై పూర్తి అవగాహనతో పాటు పాలనా వ్యవహారాలపై పట్టుంది. ఈ క్రమంలో ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి ఆయన విధుల్లో చేరకుండా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు డీపీవో బదిలీ అయినట్లా.. లేక ఆగినట్లా అనే దానిపై పంచాయతీ కార్యదర్శుల్లో చర్చ సాగుతోంది.
ఇదే విషయమై పాత డీపీవో, నిర్మల్ నుంచి బది లీపై వచ్చిన అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్క బిజీగా ఉండటంతో ఉత్తర్వుల జారీలో ఆలస్యం అయిందని, సమావేశాలు ముగియడంతో త్వరలోనే జారీ అయ్యే అవకాశమున్నట్లుగా పేర్కొన్నారు.