
పెరిగిన ‘ఉపాధి’ కూలి
● మరో రూ.7లు పెంచిన కేంద్రం ● రేపటి నుంచి అమల్లోకి.. ● కూలీలకు ఉగాది కానుక
కై లాస్నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికిచ్చే కూలి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈ సమయంలో పనులకు వచ్చే కూలీల కు ప్రయోజనం చేకూర్చేలా గతంలో కేంద్రం అదనపు భత్యం చెల్లించేది. అయితే రెండేళ్లుగా దీనిని నిలిపివేసింది. తాజాగా ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో దినసరి కూలి మరో రూ.7లకు పెంచింది. ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 2లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది.
రూ.307కు చేరిన కూలి
వలసలను అరికట్టి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు స్థానికంగానే వంద రోజుల పాటు పని కల్పించాలనే ఉద్దేశంతో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్కార్డు కలిగిన వారికి చెరువులు, కుంటలు, బావుల్లో పూడికతీత, హరితహారం కింద నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షించడం, వ్యవసాయ భూముల సంరక్షణ వంటి పనులను కల్పిస్తున్నారు. పథకం ప్రారంభంలో రోజు వారీ కూలి రూ.87.50గా చెల్లించేవారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో కూలీలకు లబ్ధి చేకూర్చేలా కూలి సైతం క్రమంగా పెంచుతూ వస్తోంది. 2022లో రూ.12 పెంచగా, 2023లో రూ.15 పెంచారు. గతేడాది అత్యధికంగా రూ.28లు పెంచడంతో రోజువారీ కూలి రూ. 300కు చేరింది. తాజాగా మరో రూ.7 పెంచడంతో ఇది రూ.307కు చేరువైంది. పస్తుతం రోజు వారీ సగటు కూలి రూ.238.77గా చెల్లిస్తున్నారు.
పెరుగనున్న కూలీల సంఖ్య
జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలంతా ఉపాధి పనులపైనే ఆసక్తి చూపుతారు. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భ రోసా పథకం అమలు చేయనుండటంతో కూలీ ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో రానున్న రెండు నెలల పాటు ఉపాధి పనులు ముమ్మరంగా సాగనున్నాయి. ప్రతీ కూలీకి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు తదనుగుణంగా బడ్జెట్ కేటా యించారు. ఈ పనులకు హాజరయ్యే కూలీలకు అవసరమైన పార, గడ్డపార, తట్టల కొనుగో లుకు కేంద్ర ప్రభుత్వం గతంలో అదనపు భత్యం చెల్లించేది. అయితే మూడేళ్లుగా దాన్ని నిలిపివేసింది. బదులుగా కూలి పెంచుతూ వస్తోంది.
జిల్లాలో..
జాబ్కార్డులు : 2.23 లక్షలు
యాక్టివ్ జాబ్ కార్డులు : 1.36లక్షలు
నమోదు చేసుకున్న కూలీలు : 3.45లక్షలు
పనులకు వచ్చే కూలీలు : 2.17లక్షలు
వంద రోజులు పని పూర్తిచేసిన కుటుంబాలు : 4,063
వచ్చే ఆర్థిక సంవత్సర పనిదినాల లక్ష్యం : 51.79 లక్షలు
రేపటి నుంచి అమలు
కేంద్ర ప్రభుత్వం పెంచిన దినసరి కూలి ఈ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో కూలీలకు ఆర్థికంగా కొంత లబ్ధి చేకూరనుంది. జాబ్కార్డు కలిగిన ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతతో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.
– రవీందర్, డీఆర్డీవో, ఆదిలాబాద్