
‘పది’ంతల ఆనందం
● ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు ● ఇంటిబాట పట్టిన వసతిగృహ విద్యార్థులు ● ఈ నెల 7నుంచి మూల్యాంకనం
ఆదిలాబాద్టౌన్: ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టి పబ్లిక్ పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తొలి పరీక్షకు గుబులు చెందిన వారు చివరి పరీక్ష ముగియడంతో కేరింతలు కొడుతూ ఇంటిముఖం పట్టారు. గతనెల 21న పరీక్షలు ప్రారంభం కాగా బుధవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ఆయా వసతిగృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు వచ్చి వారిని తీసుకెళ్లారు. బస్టాండ్ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడింది. పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7 నుంచి 15 వరకు జిల్లా కేంద్రంలోని సెయిట్ జోసెఫ్ కాన్వెంట్లో స్పాట్ నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి లక్ష 74వేల జవాబు పత్రాలు మూల్యాంకనానికి వచ్చాయి. వాల్యూయేషన్ చేసేందుకు ఉపాధ్యాయులకు విధులు కేటాయించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, గురువారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.