
అఖిల్.. మార్క్
● అక్రమార్కులపై ఎస్పీ కొరడా ● మట్కా, గంజాయి, బెట్టింగ్పై ఫోకస్ ● ‘బెల్టు’దందా, వీడీసీలకు చెక్పెట్టేలా కసరత్తు ● ‘మెసేజ్ యువర్ ఎస్పీ’కి శ్రీకారం ● శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సమస్యలపై సంప్రదించాల్సిన వాట్సాప్ నంబర్ 8712659973
ఆదిలాబాద్టౌన్: అక్రమార్కులపై జిల్లా పోలీస్ బా స్ కొరడా ఝళిపిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులతో పాటు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ(వీడీసీ) ల ఆగడాలకు చెక్ పెడుతున్నారు. అంతేకాకుండా గంజాయి, మట్కా, బెట్టింగ్పై ఫోకస్ పెంచారు. అ సాంఘిక కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం చేశా రు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తంగా జిల్లాలో శాంతిభద్రతల ప రిరక్షణ విషయంలో తన మార్కు చూపుతున్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. మార్చి 9న జిల్లా బాస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో పాలన ను గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నారు. నిఘా క ట్టు దిట్టం చేయడంతో పాటు శాఖాపరంగా ఆకస్మిక తనిఖీలతో అధికారులు, సిబ్బందిని అలర్ట్ చేస్తున్నా రు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే నేరుగా సమాచారం అందించేందుకు ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’ అనే కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు.
అక్రమార్కుల్లో గుబులు..
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరికలతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. నిషేధిత వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల మట్కాపై దృష్టి సారించారు. నెలరోజులుగా మట్కా నిర్వాహకులతో పాటు ఐపీఎల్, ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న వీడీసీలనూ వదలడం లేదు.
● ఇప్పటివరకు జిల్లాలో ఆరు బెట్టింగ్, జైనథ్, బేల మండలాల్లో వీడీసీ సభ్యులపై రెండు కేసులు నమోదయ్యాయి.
● జిల్లా కేంద్రంతో పాటు జైనథ్, ఉట్నూర్లో ఇటీవల గంజాయి విక్రయదారులపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
● జైనథ్, బేల, భీంపూర్ మండలాల్లో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తున్న వారిపై సుమారు 20కి పైగా కేసులు నమోదు చేశారు.
● కత్తులతో విన్యాసం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించిన ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి.ఇందులో ఆది లాబాద్లో రెండు, బోథ్లోఒక కేసు నమోదైంది.
● నేరడిగొండ, జిల్లా కేంద్రంలోని దాబాల్లో మ ద్యం విక్రయిస్తున్న వారితో పాటు బెల్టుషాపుల నిర్వాహకులపై కూడా నమోదు చేశారు. దాబా లపై రెండు, బెల్టుషాపులపై మూడు కేసులు నమోదయ్యాయి.
● జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో రోడ్డు ప్ర మాదాలు జరగకుండా ఫోకస్ పెంచారు. ఇదివరకు సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా, ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ఉదయం నుంచే వీటిని నిర్వహిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఖాకీలపై కూడా దృష్టి..
అలాగే పోలీసు శాఖలో ఎవరైనా అక్రమాలకు పా ల్పడినా వారిపై కూడా ఎస్పీ దృష్టి సారించారు. కొంత మంది బెల్టుషాపులు, తెల్లకల్లు దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి నెలనెలా ‘మామూలు’ తీసుకుంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది.
మెసేజ్ యువర్ ఎస్పీకి శ్రీకారం..
జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు చో టు చేసుకుంటే నేరుగా సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం యువతకు అందుబాటులో ఉండడంతో సులువుగా సంప్రదించవచ్చనే ఆలోచనతో దీనిని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి సమస్యలు, సమాచారం ఉన్నా నేరుగా వాట్సాప్ ద్వారా సంప్రదించేలా చర్యలు చేపట్టారు. సంబంధిత సమస్యలపై పూర్తి వివరాలు రాసి 8712659973 వాట్సాప్ నంబర్ ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నారు. సత్వర పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా ఎస్పీ పర్యవేక్షణలోనే కొనసాగనుంది.
ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు..
అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడమే లక్ష్యం. గంజాయి, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ ఇసుక దందాపై ప్రత్యేక దృష్టి సారించాం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. దాబాల్లో మద్యం విక్రయాలు జరగకుండా చూస్తున్నాం. పోలీసు అధికారులెవరైనా లంచం అడిగినా, అక్రమాలకు పాల్పడినే నేరుగా సమాచారం అందించవచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. –అఖిల్ మహాజన్,ఎస్పీ