సైబర్‌ వల.. చిక్కితే విలవిల..! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ వల.. చిక్కితే విలవిల..!

Sep 23 2025 7:55 AM | Updated on Sep 23 2025 7:55 AM

సైబర్‌ వల.. చిక్కితే విలవిల..!

సైబర్‌ వల.. చిక్కితే విలవిల..!

● ఖాతాల నుంచి క్షణాల్లో మాయమవుతున్న డబ్బులు ● జిల్లాలో ఏడాది కాలంలో 94 సైబర్‌ కేసులు నమోదు ● ఇప్పటివరకు రూ. 94 లక్షలు ఫ్రీజ్‌ ● అచ్యుతాపురం కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్‌ ● పొరుగు రాష్ట్రాలకు చెందిన 33 మంది నిందితుల అరెస్ట్‌ ● నర్సీపట్నంలో నకిలీ పోలీస్‌ పేరిట రూ.1.43 కోట్లు మోసం ● అప్రమత్తతే ఆయుధమంటున్న పోలీసులు

సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకరు కాదు చాలా మంది సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు మోసపోతే, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు మోసపోతున్నారు. అత్యాశతో ఉన్నవారిని పార్ట్‌టైం, పుల్‌టైం ఉద్యోగాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ అన్‌లైన్‌లో ఫేక్‌ లింక్‌లు పెట్టి వాటిని క్లిక్‌ చేసేలా ఆశ చూపించి సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. డిజిటల్‌ లావాదేవీలలో తలెత్తే సమస్యల పరిష్కారాల కోసం గూగుల్‌లో, యూట్యూబ్‌ల్లో సెర్చ్‌ చేసుకునేవారిని ఫేక్‌ వీడియోలను యూట్యూబ్‌ల్లో ఫోస్టు చేసి ట్రాప్‌ చేస్తారు. ఫేక్‌ యాప్‌లు, ఫేక్‌ లింక్‌ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తామంటూ భయపెట్టారు...

నర్సీపట్నంకు చెందిన ఒక వృద్దుడుకు సైబర్‌ మోసానికి గురయ్యాడు. ముంబై నుంచి పోలీసులమంటూ ఫోన్‌ చేసి ..నీ బ్యాంక్‌ ఖాతాలో అనాధరైజ్డ్‌గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయింది. తక్షణమే వాటిని రిటర్న్‌ కొట్టకపోతే నిన్ను అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించారు. డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తామంటూ సైబర్‌ మోసగాళ్ల భయపెట్టారు. తక్షణమే నీ బ్యాంక్‌ ఖాతా వివరాలన్నీ చెప్పండి..చెక్‌ చేస్తాం. లేదంటే మిమ్మల్ని అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందంటూ నలుగురు సైబర్‌నేరగాలు మాట్లాడారు. వారి మాటలు నమ్మి బ్యాంక్‌ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.1 కోటి 43 లక్షల వరకూ తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్‌ హెల్ప్‌లైన్‌ (1930)కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ధర్యాప్తులో భాగంగా తక్షణమే ఆ సైబర్‌ నేరగాళ్ల బ్యాంక్‌ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. ఎవరైతే బెదిరించి తస్కరణకు పాల్పడ్డారో ఆ సైబర్‌నేరగాళ్లను కూడా 4గురును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు.

ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో మోసం...

అనకాపల్లి టౌన్‌లో గల గవరపాలెంకు చెందిన మణికంఠ అమెజాన్లో ఉద్యోగం కోసం ధరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్‌లో కంపెనీ పేరుతో ఒక లింక్‌ వచ్చింది. ఇది పార్టు టైమ్‌ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చనే చెప్పడంతో ముందుగా రూ.1,000తో రిజిస్ట్రేషన్‌ చేసుకోమని చెప్పారు. అనుమానంతోనే పోతే వెయ్యే కదా అని ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. ఆవిధంగా చేసిన మణి కంఠకు కొద్ది రోజుల్లోనే రూ.1,400 పంపించాడు. దీంతో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం బావుందని నమ్మిన మణికంఠ అలా దపదఫాలుగా రూ.1.80 లక్షలు వరకూ వారికి పంపిస్తూనే ఉన్నాడు. అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్‌ చేశారు.

అచ్యుతాపురం కేంద్రంగా సైబర్‌డెన్‌...

అచ్యుతాపురంలో ఒక అపార్ట్‌మెంట్‌లో సైబర్‌ డెన్‌ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ కాల్‌ సెంటర్‌ను నడుపుతూ ప్రజల వ్యక్తిగత బ్యాంక్‌ వివరాలు మోసపూరితంగా సేకరించి, ఖాతాల్లోని డబ్బులను మాయం చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారిని కూడా టార్గెట్‌ చేసే ఆ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులను సీఐడీకి కూడా అప్పగించడం జరిగింది. ఇందులో సైబర్‌ నేరస్తులకు శిక్ష పడడమే కాకుండా..నిరపరాధులను కూడా రక్షించారు.

94 కేసుల్లో రూ.93.74 లక్షలు ఫ్రీజ్‌

జిల్లాలో జూలై 1న నుంచి నేటి వరకూ 94 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ. 93,78,304 మొత్తాన్ని ఫ్రీజ్‌ చేశారు. అలాగే రూ.15,45,234 మొత్తాన్ని 17 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లించారు.

సు‘రక్షి’తమైన డిజిటల్‌ లావాదేవీలు...

ఎవరితో కూడా బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, యూపిఐ పిన్‌, ఓటీపీ, ఏటీఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచింది.

డిజిటల్‌ లావాదేవీలకు బార్‌కోడ్‌లు, క్యూఆర్‌ కోడ్‌లు స్కానింగ్‌ లేదా ఎంపిన్‌ని లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.

ఏదైనా ఫోన్‌కాల్‌, ఈ–మెయిల్‌ చేసి మీ కేవైసీ అప్డేట్‌ చేయాలని వివరాలు అడిగినా చెప్పరాదు. ఒక వేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవాలి. హోం బ్యాంక్‌ శాఖను సంప్రదించాలి.

ఈమెయిల్‌లు, ఎస్‌ఎంఎస్‌లలో యూఆర్‌ఎల్‌, డొమైన్‌ పేర్లను స్పెల్లింగ్‌ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇవి ‘‘హెచ్‌టీటీపీఎస్‌’’తో ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కోసం అధికార వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలి.

ఏదైనా వెబ్‌సైట్‌, అప్లికేషన్‌లో మీ ఈమెయిల్‌ను యూజర్‌ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్‌ పాస్‌వర్డ్‌ను ‘పాస్‌వర్డ్‌’ అని పెట్టుకోవద్దు.

జిల్లాలో గత ఆరేళ్లుగా సైబర్‌ కేసుల వివరాలు..

2021లో 128

2022లో 217

2023లో 310

2024 జూన్‌ వరకూ 201

2024 జూన్‌ నుంచి నేటి వరకూ 94 కేసులు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement