ఆర్థికాభివృద్ధి సాధించాలి
కలెక్టర్ దినేష్కుమార్
పాడేరు : స్వయం సహాయక సంఘాలకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో డుంబ్రిగుడ మండలాలనికి చెందిన 38 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.2కోట్ల 10లక్షల 10వేల విలువైన నమూనా చెక్కులను ఆయన అందజేశారు. ఇదే మండలంలో మల్బరీ పెంపకందారులకు ఒక్కోక్కరికి రూ.లక్ష చొప్పున రూ.6లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడమే కాకుండా తిరిగి సక్రమంగా వాయిదాలు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళి, ఎల్డీఎం మాతునాయుడు, జిల్లా పట్టు పరిశ్రమల అధికారి కె. అప్పారావు పాల్గొన్నారు.


