● రాజకీయపార్టీలతో డీఆర్వో సమావేశం
తుమ్మపాల : ఓటరు జాబితాలో సమస్యలు, అభ్యంతరాలు ఉంటే బూత్ లెవెల్ అధికారికి గాని, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి గాని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా రెవెన్యూ అధికారి వై. సూర్యనారాయణరావు సూచించారు. గురువారం ఆయన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఓటరు జాబితాల సవరణలో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో అసెంబ్లీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు, అభ్యంతరాలు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ కానుక రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. ఓటరు జాబితాలోని సమస్యలను ఎన్నికల కమిషన్న్ దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు, పరస్పర అనుకూలమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బూత్ స్థాయి అధికారుల నియామకం, ఓటరు జాబితాలను నాణ్యతగా తయారు చేసేందుకు, మెరుగుపరిచేందుకు మరింత మంది బూత్ స్థాయి అధికారులు, ఎలక్టోరల్ అధికారుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, కె.ఎం.నాయుడు, వి.వి.సంతోష్ కుమార్, గంట శ్రీరాము, మీసాల సుబ్బన్న, మల్లపాటి కోటేశ్వరరావు, హరినాథబాబు పాల్గొన్నారు.