
పన్నుల వసూళ్లలో నర్సీపట్నం టాప్
● గత ఏడాది కంటే 12.50 శాతం అదనపు రాబడి ● రాష్ట్రంలో నర్సీపట్నం మున్సిపాలిటీకి 8వ స్థానం ● మున్సిపల్ కమిషనర్ సురేంద్ర వెల్లడి
నర్సీపట్నం: ఇంటి పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో నర్సీపట్నం మున్సిపాలిటీ టాప్లో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నర్సీపట్నం పురపాలక సంఘానికి 8వ స్థానం లభించిందన్నారు. పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించటం వెనుక రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పన్నుల బకాయిలు, ఖాళీ జాగా పన్నులు, ప్రైవేటు మంచి నీటి కుళాయి పన్నులు, టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన డిస్ప్లే డివైసెస్ ఫీజులు 2023–24 కంటే 2024–25 సంవత్సరంలో 12.50 శాతం అదనంగా వసూలు చేశామన్నారు. పురపాలక సంఘానికి పన్నులు చెల్లించి సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత ఏడాది ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులు రూ.4.73 కోట్లు వసూలు కాగా ఈ ఏడాది మార్చి నాటికి రూ.5.62 కోట్లు వసూలు చేశామన్నారు. ఈ నెల 31వ తేదీ ఆఖరు రోజున రూ.30 లక్షలు వసూలైందన్నారు.
నేడు సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు
బీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, ఈబీసీ కాపు కార్పొరేషన్ల ద్వారా వివిధ రకాల యూనిట్లకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాల మంజూరుకు బుధవారం బ్యాంక్ మేనేజర్ల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తెలిపారు. మున్సిపాలిటీలోని 17 సచివాలయాల నుంచి 380 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు పురపాలక కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తుదారులు ఆన్లైన్లో పెట్టుకున్న దరఖాస్తు, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాల జెరాక్స్లు తీసుకురావాలన్నారు. వాహనానికి దరఖాస్తు చేసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, ఆధార్, రేషన్ కార్డులు, కుల, ఆదాయ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.