నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’ | - | Sakshi

నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’

Apr 2 2025 2:10 AM | Updated on Apr 2 2025 2:24 AM

నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’

నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’

● సమష్టి కృషితో విజయవంతం చేయాలి ● సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

తుమ్మపాల: జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. ఇందుకు అందరూ కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో ‘నవోదయం 2.0’ పై పోలీస్‌, అటవీ, పంచాయతీరాజ్‌, గిరిజన శాఖలతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా చుట్టూ చాలా జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ఉండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు మరింత సూక్ష్మ దృష్టిని సారించాలన్నారు. ప్రతి గ్రామ, మండల స్ధాయిలో కమిటీలను నియమించి విధులు, బాధ్యతలను అవగాహన పరచాలన్నారు. నాటుసారా నిర్మూలనకు గ్రామస్ధాయి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నాటుసారా సేవించడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో ఏ కేటగిరీలో 21 గ్రామాలు, బీ కేటగిరిలో 45 గ్రామాలు, సీ కేటగిరిలో 85 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారు ప్రత్యామ్నాయ ఉపాధి పొందేలా బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు సహకరిస్తామన్నారు.

కఠిన శిక్షలు

నాటు సారా తయారీ, రవాణా విక్రయాలు కొనసాగించే వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ చెప్పారు. తొలుత తహసీల్దార్‌ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్‌ చేయడం జరుగుతుందన్నారు. తర్వాత ఏడాదిపాటు బెయిల్‌ రాకుండా పీడీ యాక్ట్‌ నమోదవుతుందన్నారు. 8 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చన్నారు. జిల్లాలో నాటుసారా తయారుచేసినా, రవాణా చేసినా, నిల్వ చేసినా, అమ్మకాలు జరిపినా 14405 టోల్‌ ఫ్రీ నెంబరుకు కాల్‌ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమస్యాత్మకంగా ఉన్న గ్రామాల్లో నిర్వహించే సమావేశాలకు ఎస్‌హెచ్‌వోలు హాజరు కావాలన్నారు. గతంలో నాటుసారా తయారు చేసిన వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ సూర్జిత్‌ సింగ్‌, జిల్లా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ అధికారి వి.సుధీర్‌, జిల్లా అటవీశాఖ అధికారి శామ్యూల్‌, జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్‌) మోహన్‌రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగ శిరీష, ఎకై ్సజ్‌ శాఖ ఇన్‌స్పెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement