తుమ్మపాల : తెలుగు వారి అస్తిత్వాన్ని కాపాడేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పొట్టి శ్రీరాములు 125 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనతో పాటు కలెక్టర్ విజయకృష్ణన్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్ఫాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు త్యాగాన్ని సదా స్మరించుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందన్నారు. ఇప్పుడు అమరావతిలో త్యాగాల విగ్రహం పేరుతో 6.8 ఎకరాల్లో 58 అడుగుల అమరజీవి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వతంత్ర పోరాటంలో భాగస్వామి అయ్యారని, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసారని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేసి ఒంటరి పోరాటంతో ఆత్మ త్యాగంతో జ్వాలాగ్నిగా మారారన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగమూర్తి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని, అలాంటి వ్యక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ప్రజా రాజధాని అమరావతిలో ఆయన తొలి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని గాంధేయ మార్గంలో పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరజీవి త్యాగాన్ని ఈ తరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు కూడా ఆయన త్యాగం ప్రధాన కారణంగా నిలిచిందన్నారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగం దేశచరిత్రలో చిరస్మరణీయమన్నారు. తెలుగు జాతి చరిత్రలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ షేక్ అయిషా, కార్పొరేషన్ల చైర్మన్లు దామాచర్ల సత్య, పీలా గోవిందా సత్యన్నారాయణ, మళ్ల సురేంద్ర, బత్తుల తాతీయ్య బాబు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


