తాడిపత్రికి చేరుకున్న ఫయాజ్‌ | - | Sakshi
Sakshi News home page

తాడిపత్రికి చేరుకున్న ఫయాజ్‌

Mar 31 2025 6:54 AM | Updated on Mar 31 2025 6:54 AM

తాడిపత్రికి చేరుకున్న ఫయాజ్‌

తాడిపత్రికి చేరుకున్న ఫయాజ్‌

తాడిపత్రి టౌన్‌: భారీ పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రి వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఫయాజ్‌బాషా తన ఇంటికి ఆదివారం చేరుకున్నారు. ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకట్రామిరెడ్డి.. అనంతపురంలో ఎస్పీ జగదీష్‌ను కలసి సమస్యను వివరించిన విషయం తెలిసిందే. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు ఫయాజ్‌బాషాకు ఎస్పీ అనుమతించారు. ఈ నెల 23న తన నూతన గృహంలో ఇఫ్తార్‌ విందును ఫయాజ్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది గిట్టని జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో ఫయాజ్‌ ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడి చేసింది టీడీపీ వారైతే... పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు 17 మందిపై కేసులు బనాయించారు. అనంతరం ఈ నెల 26న అర్ధరాత్రి ఫయాజ్‌బాషాను గుట్టుచప్పుడు కాకుండా అనంతపురానికి తరలించారు. రంజాన్‌ వేళ కుటుంబసభ్యులతో కలసి పండగ జరుపుకోవాలనే ఆయన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరిస్తూ వచ్చారు. ఆంక్షలు విధిస్తూ 4 రోజుల పాటు కుటుంబసభ్యులకు దూరం చేశారు. దీంతో ఈ నెల 29న అంజాద్‌బాషా, అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌, కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గౌసుల్‌ అజామ్‌ తదితరులు ఎస్పీ జగదీష్‌ను కలసి తాడిపత్రిలో జేసీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసారు. ఫయాజ్‌బాషాను తాడిపత్రికి వెళ్లకుండా అంక్షలు విధించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. దీంతో స్పందించిన ఎస్పీ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు మధ్య ఆదివారం సాయంత్రం తాడిపత్రిలోని తన ఇంటికి ఫయాజ్‌బాషా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ రోహిత్‌కుమార్‌, సీఐ సాయిప్రసాద్‌ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులు తాడిపత్రిలోని పలు కూడళ్లు, ఫయాజ్‌ ఇంటి వద్ద బందోబస్తు చేపట్టారు.

పట్టణంలో పోలీస్‌ భారీ బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement