కూటమి సర్కార్ కక్ష సాధింపు
● ఇటీవల మాజీ ఎమ్మెల్యే విశ్వతో సహా 16 మందిపై అక్రమ కేసులు
● తాజాగా పోలీసుస్టేషన్కు
పిలిచి విచారణ
ఉరవకొండ: ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ 27న పోరుబాట పేరుతో ఉరవకొండలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యుత్ శాఖ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి ఏడీ భాస్కర్కు వినతి పత్రం అందించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు కదం తొక్కడంతో ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డితో పాటు 16 మంది పార్టీ ముఖ్య నేతలపై కేసులు బనాయించారు. అప్పట్లో టీడీపీ ముఖ్య నేతలు విద్యుత్ శాఖ ఏడీపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులు తమ విధులకు ఆటంకం కల్గించారని, దూషించారంటూ ఆయనతో తప్పుడు ఫిర్యాదు చేయించింది.ఈ క్రమంలో మంగళవారం వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, పార్టీ నాయకులు లత్తవరం గోవిందులను ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. అక్రమ కేసులతో తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా, న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు.
దగ్గుపాటి అనుచరుల బరితెగింపు
అనంతపురం రూరల్: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు బరితెగించారు. ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఉగాది, రంజాన్ పండుగల అనంతరం వినోదం కోసం అనంతపురం సమీపంలోని శిల్పారామానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలా వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం శిల్పారామం పక్కనే స్టాండ్ ఏర్పాటు చేసి ఒక రోజు టోల్ వసూలు చేసుకోవడానికి ఇటీవల టెండర్ నిర్వహించగా.. రాజీవ్కాలనీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దక్కించుకున్నారు. అయితే, స్టాండ్లో పెట్టిన వెహికల్స్కు మాత్రమే టోల్ వసూలు చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదు. మంగళవారం శిల్పారామంకు కిలోమీటర్ దూరంలోనే రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి మరీ డబ్బు వసూలు చేశారు. ‘తాము స్టాండ్లో వాహనాలు పెట్టలేదు.. ఎందుకు టోల్ కట్టాలి’ అంటూ కొంతమంది నిలదీసినా ప్రయోజనం లేకుండా పోయింది. ‘ఎక్కడ వెహికల్స్ పెట్టినా డబ్బివ్వాల్సిందే.. లేదంటే బండ్లకు గాలి తేసేస్తాం’ అంటూ బెదిరించడంతో చేసేది లేక చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే అనుచరులు అక్రమ వసూళ్లు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు మండిపడ్డారు.
భూ సేకరణ
త్వరితగతిన పూర్తవ్వాలి
● జేసీ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ మంగళవారం కలెక్టరేట్ నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 544–డీ పనులు వేగవంతం చేయాలన్నారు. రీ–సర్వే చేపట్టిన 31 పైలెట్ గ్రామాల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలన్నారు. భూ యజమానుల నుంచి అభ్యంతరాలు వస్తే విచారణ చేసి పరిష్కరించాలని చెప్పారు. రెండోదశలో 62 గ్రామాల్లో చేపట్టిన సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామ, బ్లాక్, ప్రభుత్వ భూముల సర్వే పూర్తి చేయాలన్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్ను ఆదేశించారు. ‘ఐవీఆర్ఎస్’ ద్వారా వీఆర్ఓ, గ్రామ సర్వేయర్ల పనితీరు పరిశీలిస్తామని, పనితీరు సరిగాలేని వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు.
కూటమి సర్కార్ కక్ష సాధింపు


