![AP CM YS Jagan Launches Poster On International Tiger Day 2020 - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/29/ys-jagan.jpg.webp?itok=Jt7HwjVl)
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 3727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు దేశంలోనే అతిపెద్దదని, ప్రస్తుతం అక్కడ 60 పులులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పులులు సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా.. రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల పులులు సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. (ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు)
అదే విధంగా పులుల రక్షణ అటవీ వన్యమృగాల సంరక్షణలో నాగార్జునసాగర్–శ్రీశైలం రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగలు గొప్ప పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫారెస్టు రిజర్వు నిర్వహణలో చెంచుల సహకారంతో సమర్ధవంతమైన మానవ వనరుల నిర్వహణకు గాను భారత ప్రభుత్వం, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఎక్సెలెన్స్ అవార్డును ప్రదానం చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న పులుల జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న కృషిని సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశంలో నీరబ్కుమార్ ప్రసాద్, (అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ సిఎస్) ఎన్. ప్రతీప్ కుమార్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్), అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment