
విశాఖ : రాబోవు కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్
రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.