
సాక్షి, అమరావతి/ నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కు సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈ నెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
‘భారతి పే’ పేరిట సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుని నివాసానికి సీఐడీ అధికారులు శుక్రవారం వెళ్లగా విజయ్ అందుబాటులో లేరు. దాంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని విజయ్ నివాసంలో ఇదివరకే నోటీసు ఇవ్వటం జరిగిందని, విచారణకు రానందున మరోసారి 41 ఏ నోటీసు ఇచ్చామని సీఐడీ పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు.