
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్కు నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి అంబటి రాంబాబు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్ధానంలో నిలిచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగానే మంత్రి, అధికారులను సీఎం జగన్ అభినందించారు.