
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు.
ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.
న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి.. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్ను అందుబాటులో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment