విజయనగరం ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ | CM Jagan Visit Vizianagaram Train Accident Spot Updates - Sakshi
Sakshi News home page

విజయనగరం రైల్వే ప్రమాద బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

Published Mon, Oct 30 2023 9:48 AM | Last Updated on Mon, Oct 30 2023 2:18 PM

CM Jagan Visit Vizianagaram Train Accident Spot Updates - Sakshi

సాక్షి, గుంటూరు: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆ‍యన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.

షెడ్యూల్‌ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు.​ ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ప్రమాదానికి గురైన బోగీల్ని తొలగిస్తున్న అధికారులు. ఈ క్రమంలో సీఎం పర్యటనతో పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఆయన నేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు.

గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆపై విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని పరామర్శించారు.

విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్‌ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్‌ రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సిగ్నల్‌ లేకపోవడంతో భీమాలి-అలమండ స్టేషన్ల మధ్యలో పలాస ప్యాసింజర్‌ అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో ఈలోపు వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్‌ వేగంగా వచ్చి ఢీకొంది. పలాస ప్యాసింజర్‌కు చెందిన గార్డ్‌ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్‌పై బొగ్గు లోడ్‌తో ఉన్న గూడ్స్‌ రైలు ఇంజిన్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ ప్యాసింజర్‌ ఇంజిన్‌ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఘటనలో 13 మంది మృతి చెందగా.. 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అలాగే సీఎం జగన్‌ సూచనతో మంత్రి బొత్స ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం ప్రకటన కూడా చేశారు సీఎం జగన్‌.

రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.  మరోవైపు ఘటన నుంచి సీఎం జగన్‌ను ఫోన్‌ చేసి ఆరా తీసిన కేంద్ర రైల్వే శాఖ  మంత్రి అశ్విని వైష్ణవ్.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం.. ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement