
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు.
ముందెన్నడూ లేనివిధంగా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.
అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment