
మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, లేకుంటే ఫైన్ విధించాలి
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, లేకుంటే ఫైన్ విధించాలి అని తెలిపారు. 104 కాల్ సెంటర్ను ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ సమస్యలన్నింటికీ 104 నంబరు పరిష్కారంగా ఉండాలి. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు.. హోటళ్లలో భౌతిక దూరం తప్పనిసరి. కన్వెన్షన్ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో.. రెండు కుర్చీల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. థియేటర్లలో ప్రతి 2 సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీ ఉంచాలి’’ అని తెలిపారు.
‘‘ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో ఉండాలి. కోవిడ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్లు త్వరగా ట్రేస్ చేయాలి. కోరుకున్న వారందరికి కరోనా టెస్టులు చేయాలి. అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలి. విశాఖ ప్లాంట్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ వాటా సరఫరా అయ్యేలా చూడాలి.. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్