
సాక్షి, అమరావతి: కృష్ణానదిలోకి భారీగా వరదజలాలు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లొస్పై వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈమేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను ఖాళీచేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేసుకుని ఆమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలోనూ వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ముంపు బాధితులకు ఆహారం, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టంచేశారు.