
సాక్షి,అమరావతి: అన్ని ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా అంతర్గత కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లకు శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి మహిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అందువల్ల ఫిర్యాదుల కమిటీలను తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం కాకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ శాఖాధిపతులు చూడాలని, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు మహిళా కమిషన్కు పంపాలని ఆదేశించారు.