
సాక్షి, అమరావతి: డిజిటల్ క్రాప్ సర్వే (కేంద్ర ప్రాయోజిత పథకం) పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలను ఎంపిక చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజ తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి సహా ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మనోజ్ ఆహూజ మాట్లాడుతూ ఈ ప్రక్రియ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మ్యాచింగ్ గ్రాంట్గా 40 శాతం నిధులు సమకూరుస్తోందన్నారు. కేంద్రం తన వంతుగా రూ.47.59 కోట్లు కేటాయించిందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందని తెలిపారు.
ప్రతి రైతుకు యూనిక్ ఐడీ
డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా రైతులకు సంబంధించిన సమాచార సేకరణ, నిర్వహణతోపాటు ప్రతి రైతుకూ యూనిక్ ఐడీలను ఇవ్వాల్సి ఉంటుందని ఆహూజ తెలిపారు. అలాగే యూనిఫైడ్ ఫార్మర్ సరీ్వస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్ఎస్ఐ)ను అందుబాటులోకి తేవాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం, ఆయా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే వివిధ పంటలను మరింత కచ్చితత్వంతో అంచనా వేయొచ్చన్నారు. ఆగస్టు 15 నుంచి డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభిస్తామని చెప్పారు.
సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే మంచి నిర్ణయమన్నారు. డిజిటల్ క్రాప్ సర్వేపై వివిధ సందేహాల నివృత్తికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడతారన్నారు. ఈ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. దీని అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తిరుమల నడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి
Comments
Please login to add a commentAdd a comment