
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలోకి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Sake Sailajanath) చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు.
వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే..
ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరుపున వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైఎస్సార్సీపీలోకి చేరానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని శైలజానాథ్ అన్నారు.
‘‘ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తా.. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం. జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పనిచేస్తా’’ అని శైలజానాథ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు.
కాగా, అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదీ చదవండి: రెడ్బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్!


Comments
Please login to add a commentAdd a comment