AP CM Davos Tour: Grand welcome to CM Jagan in Davos - Sakshi
Sakshi News home page

Grand Welcome To CM Jagan: దావోస్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

May 22 2022 4:01 AM | Updated on May 22 2022 2:36 PM

Grand welcome to CM Jagan in Davos - Sakshi

దావోస్‌లో అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆదివారం (నేటి) నుంచి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం సాయంత్రం దావోస్‌ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్లారు. జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టులో స్విట్జర్లాండ్‌లో ఉంటున్న  తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరోఖ్యరాజ్‌ తదితరులు సీఎంకు సాదర స్వాగతం పలికారు.

స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రజలతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించి కారులో దావోస్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు స్వాగతం పలికారు. 
సీఎం వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి 

ఎయిర్‌ ట్రాఫిక్‌ రద్దీతో ప్రయాణం ఆలస్యం
శుక్రవారం విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలస్యంగా శనివారం సాయంత్రానికి దావోస్‌ చేరుకున్నారు. వాస్తవంగా శుక్రవారం రాత్రికే దావోస్‌కు చేరుకోవాల్సి ఉన్నా, ఎయిర్‌ ట్రాఫిక్‌ రద్దీ వల్ల ఇస్తాంబుల్‌లో ఇంధన నింపుకోవడం ఆలస్యమైంది. దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం మరింత ఆలస్యం అయ్యింది. లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉండటంతో జ్యూరిక్‌లో ల్యాండ్‌ అవడానికి  ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది.

జ్యూరిక్‌లో రాత్రి 10 గంటల తర్వాత విమానాల ల్యాండింగ్‌పై నిషేధం ఉంది. దీంతో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులతో సహా రాష్ట్ర అధికారులు ప్రత్యేక ల్యాండింగ్‌ కోసం మరో మారు రిక్వెస్ట్‌ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించి ముఖ్యమంత్రితో పాటు ఉన్న అధికారులతో చర్చించి ఆ రాత్రికి లండన్‌లోనే బస ఏర్పాటు చేశారు.

తెల్లవారుజామునే జ్యూరిక్‌ నుంచి బయలుదేరడానికి సీఎం సిద్ధంగా ఉన్నప్పటికీ డీజీసీఏ నిబంధనలు అడ్డంకిగా మారాయి. విజయవాడ నుంచి పైలట్లు శుక్రవారమంతా ప్రయాణంలో ఉన్నందున నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. డీజీసీఏ నిర్ణీత సమయం ప్రకారం  పైలట్ల విశ్రాంతి సమయం పూర్తయ్యాక సీఎం బయలు దేరి శనివారం సాయంత్రానికి జ్యూరిక్‌ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి దావోస్‌ వెళ్లారు.
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న మెట్టు గోవిందరెడ్డి, కృష్ణగిరి 

దావోస్‌లో నేటి కార్యక్రమాలు 
► ఆదివారం ఉదయం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. తద్వారా డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన, నాణ్యమైన మానవ వనరుల తయారీ, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం వంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.
 
► డబ్ల్యూఈఎఫ్‌ ‘హెల్త్‌కేర్‌– హెల్త్‌’ విభాగం అధిపతి, డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో కూడా సీఎం సమావేశమవుతారు. మ«ధ్యాహ్నం బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ హన్స్‌పాల్‌ బర్కనర్‌తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్‌లో సమావేశమవుతారు.

► సాయంత్రం డబ్ల్యూఈఎఫ్‌ కాంగ్రెస్‌ వేదికలో జరిగే వెల్‌కమ్‌ రిసెప్షన్‌లో సీఎం పాల్గొంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement