
- పార్లమెంట్ లో సమగ్ర చట్టం చేసి దేశమంతా నిర్మూలించాలి
- అప్పుడే దీనికి అడ్డుకట్ట వేయగలం
- తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి డిమాండ్
ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రకటనలలో నటించి ఒక తీవ్రమైన తప్పు చేసారని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తన అభ్యంతరం తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించారని పలువురిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మందిపై కేసు నమోదు అయ్యిందన్నారు. పలువురు యాంకర్లతో పాటు సోషల్ మీడియా Influencerలపై రెడ్విత్, బీఎన్ఎస్ 3, 3(A), 4..ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేతిరెడ్డి గుర్తు చేశారు.
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంశానికి సంబంధించి భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, కర్ణాటకలలో ఒక చట్టం చేయడం జరిగిందన్నారు. పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని గత ఏపీ ప్రభుత్వం కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రిని కోరారన్నారు. ఈ మేరకు 2020లో అప్పటి సీఎం జగన్.. లేఖ రాశారన్నారు.
దీనిపై సమగ్ర చట్టం పార్లమెంట్ లో చేయాలని, మిగతా అన్నీ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దుకు కేంద్రాన్ని కోరాలని, అప్పుడే భారత్లో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను లేకుండా చేయగలమన్నారు . ఇప్పుడు తెలంగాణలో ఫైల్ చేసిన కేసులో సెలెబ్రిటీలు Influencerలపై ప్రస్తుతం పెట్టిన కేసులో బలం లేదన్నారు. వారి పాత్ర వలన డబ్బు ఎంత చలామణి అయ్యిందో తెలుస్తోందని , భారత దేశంలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం 30 శాతం పెరిగిందని, మహిళలు సైతం ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసలు అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివిధ రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడంతో పాటు కేంద్రం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను బ్లాక్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు.
"సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలే కానీ ప్రజలకు నష్టం కలిగే వ్యవహారాలు చేయడం సిగ్గు చేటని, 'మా' అసోసియేషన్ వెంటనే స్పందించి తగిన చర్యలకు తీసుకోవాలని, యూట్యూబ్లో స్టార్స్ అయినంత మాత్రాన.. రియల్ లైఫ్లో స్టార్స్ కాదన్నది వారు గుర్తెరిగి నడుచుకోవాలని కేతిరెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment