రైతు నోట రాని ట‘మాటా’ | Losses of tomato farmers in Palamaneru Revenue Division | Sakshi
Sakshi News home page

రైతు నోట రాని ట‘మాటా’

Published Sun, Feb 23 2025 5:31 AM | Last Updated on Sun, Feb 23 2025 5:31 AM

Losses of tomato farmers in Palamaneru Revenue Division

నాలుగు రాష్ట్రాల్లో సీజన్‌ మొదలవడంతో పెద్దఎత్తున వస్తున్న సరుకు

దీంతో భారీగా పతనమైన ధర 

పలమనేరులో 15 కిలోల బాక్సు ధర రూ.150 మాత్రమే 

టమాటాను కొంటున్నట్లు ప్రభుత్వం బిల్డప్‌ 

కానీ, మార్కెట్‌కు వచ్చే సరుకు కొండంత.. సర్కారు కొనేది గోరంత 

పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా­లో­ని పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో టమాటా రైతులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ నష్టాలు చవిచూస్తున్నా­రు. ధరలు భారీగా పతనమవడమే ప్రధా­న కారణం. పలమనేరు టమాటా మార్కెట్‌లో శనివారం 15 కి­లో­ల బాక్సు రూ.140 నుంచి రూ.150 వ­రకు పలికింది. అంటే.. కేజీ రూ.10 మాత్రమే. దీంతో భారీ పెట్టు­బడులు పెట్టి సాగుచేసిన రై­తు­లు లబోదిబోమంటున్నారు. 

మరోవైపు.. టమాట పండించే రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తె­లంగాణలోనూ సీజ­న్‌ మొదలవడంతో భారీగా టమాటాలు ఆయా రా­ష్ట్రాల మార్కెట్లకు చేరుతున్నాయి. అ­లాగే, పొరుగునే ఉన్న అనంతపు­రం సరుకు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతోంది. దీంతో ధరలు అమాంతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. 

అయితే.. టమాట రైతును ఆదుకునేందుకు మార్కెటింగ్‌ శాఖ రెండ్రోజులుగా టమాటాను కొని రైతుబజార్లకు విక్రయిస్తున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ నిజానికి ఎలాంటి సాయం చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.  

రైతులను ఆదుకునేది ఇలాగేనా?
రాష్ట్రంలోని టమాటా రైతులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్‌ శాఖ టమాటాలను కొంటుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు చెప్పారు. కానీ, మార్కెటింగ్‌ అధికారులు మాత్రం శుక్రవారం మొక్కుబడిగా కొని శనివారం కొనలేదు. 

అలాగే, పలమనేరు మార్కెట్‌కు రోజుకి 40–50 టన్నుల టమాటాలు వస్తుంటే ఇక్కడి అధికారులు శుక్రవారం కొన్న సరుకు కేవలం మూడు టన్నులే. పైగా.. పలమనేరు మార్కెట్‌లో శనివారం బాక్సు టమాట (15 కిలోలు) రూ.150 పలికింది. అంటే.. కిలో రూ.10 అన్నమాట. కానీ, మార్కెటింగ్‌ అధికారులు కిలో రూ.8తో కొన్నారు. ఇలాగేనా రైతులను ఆదుకునేదని వారు ప్రశ్నిస్తున్నారు.

మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి.. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమా­ట సాగుచేయా­లం­టే రూ.­1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. పంట బాగా పండితే ఎకరానికి 800 బాక్సులు దిగుబడి రావచ్చు. ఇప్పుడున్న ధరతో రాబడి ఏముంటుంది నష్టాలు తప్ప? దీనికోసం మళ్లీ అప్పులు చేయాల్సిందే. టమాటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.  
– మునివెంకటరెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం 

అంతా కొనడం కుదురుతుందా!? 
ఇక్కడి మార్కెట్‌లో కిలో రూ.8–రూ.10 రేటుతో మూడు టన్నులు కొని రైతుబజార్‌కు పంపాం. ఈ మార్కెట్‌కు నిత్యం 50 టన్నుల లోకల్‌ సరుకు, మరో 40 టన్నుల అనంతపురం సరుకు వస్తోంది. ఇదంతా కొనేందుకు కుదురుతుందా అని చూస్తున్నాం. అనంతపురం సరుకు తగ్గుముఖం పట్టగానే మార్చి 15 నుంచి ఇక్కడి సరుకు పెరుగుతుంది. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. – సంజీవకుమార్, ఏఏంసీ సెక్రటరీ, పలమనేరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement