ప్రేమజంట యోగీంద్రకుమార్ వర్మ, హేమశ్రీ (ఫైల్ ).. జంటగా అంత్యక్రియలు చేస్తున్న దృశ్యం
కడప: తెలిసీ తెలియని వయసు వారిది.. చూడగానే ఒకరినొకరిపై ఆకర్షణ కలిగింది.. మెల్లగా మాట కలిసింది.. ఆపై ప్రేమ చిగురించింది.. ఊహల్లో విహరించారు.. ఊసులెన్నో చెప్పుకున్నారు.. కలిసి జీవించాలని కలలుగన్నారు.. ఏమైందో.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థ తలెత్తింది.. మాటల్లో తేడా వచ్చింది.. తెలియని సంఘర్షణ ఏదో ఆ లేత మనసును గాయపరిచింది. అంతే ..కలిసి జీవించాలనుకున్న వారే విడివిడిగా బలవన్మరణానికి ఒడిగట్టారు.. కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చారు.. ప్రేమ జంట యోగేంద్రకుమార్వర్మ (19), హేమశ్రీ (19) విషాదగాథ ఇది.
చెన్నూరుకు చెందిన వీరిద్దరూ కడప నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతుండగా కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. చిన్నపాటి మనస్పర్థలతో చిన్నవయసులో తనువు చాలించారు. మరణంలోనైనా ఒక్కటిగా సాగనంపాలని చెన్నూరు సమీపంలో ఒకే ప్రాంతంలో పక్కపక్కన ఇద్దరికీ మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత బాధలోనూ రిమ్స్ సమీపంలోని డాక్టర్ ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సిఫారసు మేరకు యువకుడి తల్లిదండ్రులు కొడుకు నేత్రదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.


