
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మ్యారేజి సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. ఆయా సచివాలయాల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి ఎవరైనా మ్యారేజి సర్టిఫికేట్ కోసం గ్రామ, వార్డు సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పెళ్లయిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆ గడువు తర్వాత మ్యారేజి సర్టిఫికెట్ అవసరమైన వారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మ్యారేజి సర్టిఫికెట్ జారీకి సంబంధించి యూజర్ మాన్యువల్ను గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారులు అన్ని సచివాలయాలకు పంపారు. పెళ్లి జరిగిన ప్రాంతానికి సంబంధించిన సచివాలయంలోనే సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
దంపతుల ఆధార్ నంబరు, ఇతర వివరాలతో ఈ కార్డులు జారీచేస్తారు. ఈ సర్టిఫికెట్ తీసుకోవడం ద్వారా కొత్త దంపతుల పేరుతో రేషన్కార్డు విభజన ప్రక్రియ సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో రేషన్కార్డు విభజన ప్రక్రియలో ఆయా వ్యక్తుల ఆధార్ నంబరు ఆధారంగా ఏపీసేవ పోర్టల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యారేజి సర్టిఫికెట్ను ధ్రువీకరించుకునే వీలును కూడా కల్పించినట్టు చెప్పారు.