
సాక్షి,అనంతపురం: పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను,వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతపురం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు దుర్మరణం పాలయ్యారు.
రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి అనంతపురం వద్ద ఉన్న మార్తాడు గ్రామంలో పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి ప్రయాణమైంది. తిరుగు ప్రయాణంలో బళ్లారి వైపు నుండి అనంతపురంకు వెళ్తున్న కారు.. ఎదురుగా ఉన్న ఆటోను డీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె మూడునెలల కుమార్తె విద్య శ్రీ అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి మృతి చెందారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్లు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.