
సాక్షి, విశాఖపట్నం: శీతాకాలంలోనూ అల్పపీడనం, వాయుగుండం, ఫెంగల్ తుపాన్తో విలవిల్లాడిన రాష్ట్రానికి ఊరట లభించే వార్తను వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇకపై వచ్చే వేసవి కాలం వరకూ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల శుక్రవారం వానలు పడే సూచనలున్నాయన్నారు. ఈ ఏడాదికి ఇవే చివరి వానలనీ..వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ భారీ వర్షాలేవీ ఉండవని తెలిపారు. నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ.. జనవరి 2వ వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
