
రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్న రేషన్ బియ్యం
వెదుళ్లపల్లి, బాపట్ల, అప్పికట్ల ప్రాంతంలో రైస్ మిల్లుల నుంచి అక్రమ రవాణా
వెదుళ్లపల్లి నుంచి నెలకు 15 వేల క్వింటాళ్లు..
బాపట్ల, కర్లపాలెం మిల్లుల నుంచి 10 వేల క్వింటాళ్లు
బియ్యం వ్యాపారుల నుంచి కిలో రూ.22కు కొంటున్న అక్రమార్కులు
మిల్లుల్లో పాలీషింగ్ చేసి గుజరాత్లో రూ.40కు విక్రయాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బాపట్ల సమీపంలోని వెదుళ్లపల్లిలో ఉన్న ఓ రైస్మిల్లు యజమాని ఈ చౌక బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు బాపట్ల పట్టణం పరిధిలోని మరో రైస్మిల్లు యజమానితోపాటు ఇదే మండలం అప్పికట్ల ప్రాంతంలోని ఇంకో రైస్మిల్లుకు చెందిన బాపట్ల టీడీపీ నేత అనుచరుడు రేషన్ బియ్యాన్ని కొని పాలీíÙంగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా సేకరణ..
బాపట్లతో పాటు పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లోని డీలర్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.15కు ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని వెదుళ్లపల్లితో పాటు మిగిలిన ఇద్దరు మిల్లర్లకు కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. వెదుళ్లపల్లి మిల్లు యజమాని ఒక్కరే నెలకు సుమారు 15 వేల క్వింటాళ్ల బియ్యాన్ని తన మిల్లుకు తరలించి ఎప్పటికప్పుడు పాలీషింగ్ చేసి లారీలు, ట్రక్కుల ద్వారా పొన్నూరు, గుంటూరు, మిర్యాలగూడా మీదుగా హైదరాబాద్కు, అక్కడి నుంచి గుజరాత్కు తరలిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ కిలో రూ.22కు కొన్న రేషన్ బియ్యాన్ని గుజరాత్లో కిలో రూ.40కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో కిలోకు అన్ని ఖర్చులూపోను రూ.15 తక్కువ కాకుండా వస్తోంది. ఈ లెక్కన నెలనెలా రూ.కోట్లలోనే రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వెదుళ్లపల్లి మిల్లు యజమాని నెలకు 15 వేల క్వింటాళ్లు సేకరిస్తుండగా.. మిగిలిన రెండు మిల్లుల నుంచి మరో 10 వేల క్వింటాళ్లు అనుకున్నా మొత్తంగా జిల్లా నుంచి గుజరాత్కు సగటున 25 వేల క్వింటాళ్లు తరలిపోతున్నట్లు సమాచారం.
వెదుళ్లపల్లి మిల్లుకు చెందిన వ్యాపారితోపాటు బాపట్ల, అప్పికట్ల మిల్లులకు చెందిన వ్యాపారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేస్తున్నారు.
రేషన్ బియ్యం ఖరీదు ఇలా..
నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డుదారులకు డీలర్లు కిలోకు రూ.8 చెల్లించి బియ్యం వ్యాపారులకు రూ.12కు ఇచ్చేవారు. అలాగే, బియ్యం అక్రమ రవాణాదారులు బియ్యం సేకరణ వ్యాపారులకు రూ.20 చెల్లించేవారు. కానీ, రేషన్ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కార్డుదారులకు రూ.10 నుంచి రూ.12.. డీలర్లకు రూ.15 నుంచి రూ.17 వస్తోంది. ఇక వ్యాపారుల వద్ద నుంచి అక్రమ ఎగుమతిదారులు కిలో రూ.22 నుంచి రూ.24కు కొనుగోలు చేస్తున్నారు.
కార్డుదారులను వంచిస్తున్న డీలర్లు..
మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు మొక్కుబడిగా డబ్బులు చెల్లిస్తుండగా.. మరికొందరు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తెల్లకార్డు గల్లంతవుతుందని పచ్చనేతలు బెదిరిస్తున్నారు. దీంతో.. బియ్యం పోతే పోయింది కార్డు అయినా మిగులుతుందని చాలామంది పేదలు మిన్నకుండిపోతున్నారు.
దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, రేపల్లెతోపాటు పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ చాలామంది డీలర్లు గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment