
పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీ 2వ యూనిట్లో సాంకేతిక కారణాల వలన నిలిచిపోయిన విద్యుదుత్పత్తిని మరమ్మతుల అనంతరం బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తిరిగి పునరుద్ధరించారు. సంస్థలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ బాయిలర్లో అమర్చిన ట్యూబ్కు లీకేజీ ఏర్పడి సోమవారం రాత్రి 6.30 గంటలకు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
యూనిట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి బుధవారం సాయంత్రానికి లైటప్ చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరిగిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం నాలుగు యూనిట్ల నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నదని ఎన్టీపీసీ అధికార వర్గాలు వెల్లడించాయి.