
సాయినగర్ గ్రామ సభ తీర్మానం
జిల్లా అధికారులకు వినతిపత్రం
తిరుపతి అర్బన్: తమ ఊరికి మద్యం షాపు వద్దంటూ ఈనెల 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి రూరల్ మండలం పరిధిలోని సాయినగర్ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభలో ప్రజలు తీర్మానించారు. ఈ మేరకు సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డీవీ రమణ బుధవారం కలెక్టరేట్లోని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతోపాటు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవికి వినతిపత్రం అందజేశారు.
డీవీ రమణ మాట్లాడుతూ గతంలో 2014–15 సంవత్సరంలో ఒకసారి సాయినగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జయనగర్లో మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. ఆ సమయంలో స్థానిక ప్రజలందరూ అనేక రోజులపాటు సదరు మద్యం షాపు తొలగించే వరకు ప్రజా ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. గ్రామసభలో తీర్మానం మేరకు మద్యం షాపులు వద్దని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించామని తెలిపారు. తమ గ్రామపరిధిలో నూతన మద్యం షాపులు ఏర్పాటు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.