వైఎస్‌ జగన్‌ హయాంలో.. పరిమితంగానే ఏపీ అప్పులు | SBI Report Revealed That AP Has Incurred Less Debt Than The Limit In 2022 And 2023 Respectively | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హయాంలో.. పరిమితంగానే ఏపీ అప్పులు

Published Mon, Jul 29 2024 5:37 AM | Last Updated on Mon, Jul 29 2024 1:41 PM

SBI report on central budget revealed

ఏపీ, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తప్పనిసరి వ్యయం తక్కువే 

ఏపీ తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువ.. 2024–25 కేంద్ర బడ్జెట్‌పై ఎస్‌బీఐ నివేదిక వెల్లడి

రాష్ట్రంలో గత వైఎస్‌ జగన్‌ సర్కారు ఇబ్బడిముబ్బడిగా అప్పులచేసిందంటూ చంద్రబాబు బ్యాచ్‌ చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఆరి్థక సంఘం సిఫార్సుల కన్నా ఆంధ్రప్రదేశ్‌ వరుసగా 2022, 2023  సంవత్సరాల్లో పరిమతి కన్నా తక్కువ అప్పులుచేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 

గత మంగళవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్‌ విశ్లేషణాత్మక నివేదికలో ఎస్‌బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. వివిధ రాష్ట్రాల అప్పులు, తప్పనిసరి వ్యయాలు, సాధికారతతో కూడిన సంక్షేమ పథకాల వ్యయం, తలసరి ఆదాయాలతో కూడిన అంశాలను విశ్లే షిస్తూ ఎస్‌బీఐ ఈ నివేదికను విడుదల చేసింది.   – సాక్షి, అమరావతి 

పరిమితి కన్నా 1.4 శాతం తక్కువగా.. 
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కన్నా ఏపీ వరుసగా 2022, 2023 సంవత్సరాల్లో తక్కువగా అప్పులు చేసిందని.. అదే హిమాచల్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్‌ రాష్ట్రాలు 2023లో 15వ ఆరి్థక సంఘం సిఫార్సులు కన్నా ఎక్కువగా అప్పుచేసినట్లు నివేదిక తెలిపింది. ఈ సిఫార్సులతో పాటు విద్యుత్‌ సంస్కరణలు అమలుచేస్తున్న ఏపీకి 2022లో జీఎస్‌డీపీలో 4.5 శాతం మేర అప్పుచేయడానికి అనుమతి ఉందని.. అయితే 3.1 శాతమే నికర అప్పుచేసింది. అంటే.. పరిమితి కన్నా 1.4 శాతం మేర తక్కువగా అప్పుచేసినట్లు ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. 

ఇక 2023లో జీఎస్‌డీపీలో 4 శాతం అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ ఏపీ 3.5 శాతమే నికర అప్పుచేసిందని, అంటే పరిమితి కన్నా 0.5 శాతం తక్కువగా అప్పుచేసిందని నివేదిక పేర్కొంది. జాతీయ సగటు కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యయాలైన పెన్షన్, వడ్డీ చెల్లింపులు, పరిపాలనపరమైన వ్యయాలు బిహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశి్చమ బెంగాల్‌ రాజస్థాన్‌ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. 

అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, హరియాణాల్లో పెన్షన్లు, వడ్డీలు, పరిపాలనపరమైన తప్పనిసరి వ్యయం తక్కువగా ఉందని తెలిపింది. అంతేకాక.. ఏపీ తలసరి సగటు ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ఈ పరిణామం అత్యంత అనుకూలమైనదిగా నివేదిక వ్యాఖ్యానించింది.  



దేశాభివృద్ధికి జగన్‌ పథకాలు దోహదం.. 
ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సంక్షేమానికి గణనీయంగా వ్యయంచేసి సంక్షేమ రాష్ట్రాలుగా మార్చారని నివేదిక అభిప్రాయపడింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యతో అనుసంధానం చేసే సంక్షేమ పథకాలను అమలుచేసిందని, అలాగే.. మహిళలు, పిల్లల విద్య, మహిళల ఆరోగ్యంతో కూడిన పథకాలను అమలుచేసిందని పేర్కొంది. 

మహిళా సాధికారిత సాధించడమే లక్షంగా పథకాలను అమలుచేశారని, ఇవన్నీ దీర్ఘకాలంలో ఫలితాలను సాధించడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడతాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, పొదుపు సంఘాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ అమలు పథకాలు ఈ కోవలేకే వస్తాయని నివేదిక వ్యాఖ్యానించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement