![Training Process Of Election Seizure Management System Continuing In AP - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/01/23/ec.jpg.webp?itok=_Tqond-L)
సాక్షి, విజయవాడ: ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ వినియోగంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రేరేపిత రహిత ఎన్నికల పర్యవేక్షణను పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ఈ ‘ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ’ను (Election Seizure Management System - ESMS) రూపొందించింది. దీని వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది.
2023 డిసెంబర్లో చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్. తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఈ వ్యవస్థను విజయవంతంగా వినియోగించారు. ఆ అనుభవంతో త్వరలో ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలుపరిచేందుకు భారతీయ ఎన్నికల సంఘం సిద్ధమైంది.
ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అనేక రకాల రాష్ట్ర, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా ఫీల్డ్ నుంచి వచ్చే సీజర్లపై (నిర్బంధములపై ) నిజ-సమయ నవీకరణల కోసం ఉపయోగించే ఒక సాంకేతిక వేదిక. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య అంతరాయం లేని సమన్వయం, గూఢచార భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
భారతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అధికారుల బృందం కర్ణాటక రాష్ట్రంలో ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని వెబ్ లింకు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు. పరిశీలిస్తున్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు తదితరులతో పాటు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ టాక్స్, వాణిజ్య, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment