
సాక్షి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టిందని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధుల్లో పలు ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. విశాఖలో కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన జరుగుతోందన్నారు.
విశాఖ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధుల్లో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు సమీక్షించారు. విశాఖ కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి సమాధానమిస్తూ.. కార్యనిర్వాహక రాజధాని అతి త్వరలోనే విశాఖకు వస్తుందని సమాధానమిచ్చారు. సీఆర్డీఏకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉందని, ఆ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదన్నారు.