AP CM YS Jagan Speech At Kurupam Public Meeting | Jagananna Amma Vodi - Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో విద్యారంగంపై 66వేల కోట్లు ఖర్చు.. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం

Published Wed, Jun 28 2023 11:50 AM | Last Updated on Wed, Jun 28 2023 1:56 PM

YS Jagan Speech At Amma Vodi Kurupam Public Meeting - Sakshi

సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  

నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్‌ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్‌ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్‌ వేదిక నుంచి ఆకాంక్షించారు. 

ఒకటి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తున్న 42,61,965 మంది అక్కచెల్లెమ్మలకు అండగా, 83,15,341 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా రూ.6,392.94 కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైనా అమ్మ ఒడి వర్తింపజేస్తున్నాం. బటన్ నొక్కడం అంటే ఇదీ.. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్ధాయిలకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి అని కోరుతున్నా. 

►  భారతదేశంలోనే 28 రాష్ట్రాల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక మీదట కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.  పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా మీ పిల్లలను బడికి పంపించండి. నాలుగేళ్లుగా మీ పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.  గవర్నమెంట్ బడులన్నింటిలో కూడా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతి పాప చేతిలో పెడుతున్నాం. 3వ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే. పిల్లలను బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్ లు, చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటి సారిగా ఇస్తున్నాం.  బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేసి ఐఎఫ్పీలను తెచ్చి డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చాం. 

అంగన్వాడీల్లోనూ మార్పులు తెచ్చాం. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్ కూడా గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం.  పాఠశాలలన్నీ రూపు రేఖలు మార్చి 45,000 గవర్నమెంట్ స్కూళ్లలో నాడు-నేడు తెచ్చాం.  8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఇద్దరికీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా పని చేసేలా వారికి ట్యాబ్స్ అందిస్తున్న మీ మేన మామ ప్రభుత్వం. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తున్నాం. 

మీ మేనమామ ప్రభుత్వంలోనే..
పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వంలోనే.  మెస్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వమే. పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. పదో తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు-షాదీ తోఫా అమలు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసం అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు. గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా అని అడుగుతున్నా. 

ప్రభుత్వ బడులతో వెలుగులు
పెత్తందార్లకు అందుబాటులో ఉన్న ఆ చదువులకంటే గొప్ప చదువులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు.. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా పోటీ పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది.  గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వంలోనే. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. 

టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్లో నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి.  75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది అయితే, ఈ ఏడాది 67,114కు పెరిగింది.  గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలు 66.50 శాతం ఫస్ట్ క్లాస్ లో పాసయితే ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం ఈ సంవత్సరం రాబోతోంది. 

ఇవి ఫలితాలు..
2018-19లో స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. 84.48 శాతంతో మన రాష్ట్రంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80 శాతంతో, జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం. ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితాలివీ.  గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వమే.  5 మంది డిప్యూటీ సీఎంలను తయారు చేస్తే అందులో నా చెల్లెమ్మ మొట్ట మొదటి గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో పని చేసిన చరిత్ర. మీ జగనన్న క్యాబినెట్ లో గిరిజనుడు ఒక డిప్యూటీ సీఎంగా ఈరోజు పని చేస్తున్నాడు. 

ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని వేసిన చరిత్ర మనది 
నవరత్నాలను మారుమూల ఉన్న ట్రైబల్ విలేజ్ కు చేర్చాలని తపన పడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కో టవర్ ఖర్చు 80 లక్షలతో 2,600 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా కడుతున్నాం. ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది.  ఇదే ట్రైబల్ ప్రాంతంలో  కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి.  ఒకటి పాడేరులో వేగంగా కడుతున్నారు.మరొకటి కురుపాంలో రాబోతోంది.  మూడోది నర్సీపట్నంలో వేగంగా కడుతున్నారు. నాలుగోది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్లు రాబోతున్నాయి. వచ్చే నెల ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం.  గిరిజనుల కోసం ఏకంగా 147242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వో‌ఎఫ్‌ఆర్ డీకేటీ పట్టాలు 362737 ఎకరాలను పంచి పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.  కురుపాంలోనే 21311 కుటుంబాలకు 38798 ఎకరాలు పంపిణీ చేశాం. 
వాళ్లందరికీ రైతు భరోసా సొమ్మును కూడా గత నాలుగేళ్లుగా ఇస్తున్న ప్రభుత్వం మనది. నామినేటెడ్ పదవి, కాంట్రాక్ట్ నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. మన కళ్లెదుటనే గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. 
నా ఎస్టీ, ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు వీటిలో 84 శాతం కనిపిస్తున్నారు. 

పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని క్షమించగలమా? అని ప్రశ్నించారాయన. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు.  పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్‌ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది.  చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement