వైభవంగా కమలాపురం ఉరుసు
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రధాన ఉరుసు మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ముస్లిం, హిందు భక్తులు పెద్ద సంఖ్యలో ఉరుసు మహోత్సవానికి తరలివచ్చారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో దర్గా ఆవరణం కిటకిటలాడింది. భక్తులు దర్గాలోని స్వామి వారి మజార్లపై పూల చాదర్లు సమర్పించి చక్కెర చదివింపులు చేశారు. పీఠాధిపతి మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని భక్తులు గౌరవ పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, తదితర రంగుల రాట్నాల వద్ద పిల్లల సందడి కనిపించింది.
● దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటీ ఆద్యంతం అలరించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీకి చెందిన ఖుత్బీ బ్రదర్స్, యూపీ కి చెందిన సర్ఫరాజ్ అన్వర్ సాబిరి ల మధ్య వేకువ జాము వరకు ఖవ్వాలీ పోటీ ఉత్సాహ భరితంగా సాగింది. ఖవ్వాలి విన్న ఖవ్వాలి ప్రేమికులు పాటలను వింటూ, మజా చేస్తూ ఖుషీ ఖుషీగా నజరానా సమర్పించారు.
వైఎస్సార్సీపీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు
కమలాపురంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం రాత్రి దర్గా కన్వీన ఇస్మాయిల్ ఆహ్వానం మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారి మజార్లపై చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రసవత్తరంగా బండలాగుడు పోటీలు
ఉరుసును పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాడుగు పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన 11 కాండ్ల జతల ఎడ్లు పోటీలో తలపడ్డాయి. ప్రొద్దుటూరుకు చెందిన బీసీఎస్ఆర్ బుల్స్ అధినేత వెంకటసాయి భవిత్రెడ్డి ఎడ్లు 5107 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా పెద్ద కొట్టాలకు చెందిన నారాయణరెడ్డి ఎడ్లు 4694 అడుగులతో ద్వితీయ స్థానంలో, దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన టి.అశోక్ ఎడ్లు 4600 అడుగులతో తృతీయ స్థానంలో, కమలాపురం మండలం జంగంపల్లెకు చెందిన నాగ సుబ్బారెడ్డి ఎడ్లు 4470 అడుగులతో నాల్గవ స్థానంలో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
భక్తులతో కళకళలాడినదర్గా ప్రాంగణం
అలరించిన ఖవ్వాలీ పోటీ


