
తొమ్మిది మంది తమిళ స్మగ్లర్ల్ల అరెస్టు
● రూ. 34.40 లక్షలు విలువైన
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి
రాయచోటి/సుండుపల్లె : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసి రూ. 34.40 లక్షలు విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. బుధవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేతపై ఎస్పీ వివరించారు. టి.సుండుపల్లి మండలం, మాచిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారం మేరకు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఆర్ఏస్టీఎఫ్ సీఐ మధు, కలికిరి సీఐ అనిల్ల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలు కాపు కాచాయన్నారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడానికి ముందుకు వెళ్లగా కొంతమంది కారులో ఎక్కి పోలీసులను ఢీ కొట్టే ప్రయత్నం చేసి తప్పించుకున్నారన్నారు. వారిలో తొమ్మిది మందిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే తరలించడానికి సిద్ధంగా ఉంచిన 344 కిలోల బరువుగల 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన బాకియరాజ్ అన్నామలై, రజిత్ కుమార్ గోవిందన్, జి.సామినాథన్, సురేష్ కుమార్, తిరుమలై చిన్నయాల్, వేలూరు జిల్లాకు చెందిన దురైసామి, రాజా మణి, పరశాంత్ చంద్రన్, రాజా విజయ కుమార్లు పట్టుబడిన వారిలో ఉన్నట్లు తెలిపారు. పారిపోయిన స్మగ్లర్లను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఎర్రచందనం వంటి విలువైన వనరులను అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అత్యంత విలువైన సహజ సంపదను దోపిడీ చేయడంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజల భద్రత, ప్రకృతి వనరుల రక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తమిళ స్మగ్లర్లను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
కారుతో సహా ఎర్రచందనం స్వాధీనం
పీలేరు : కారుతో సహా 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున యల్లమంద, పులిచెర్ల, మంగళంపేట మార్గాల్లో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేగంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేశారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఇళయరాజాను అదుపులోకి తీసుకున్నారు. 10 ఎర్రచందనం దుంగలు, వాహనం విలువ రూ. 24.,82 లక్షలు చేస్తుందని వివరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారులు చంద్రశేఖర్, ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డిప్రసాద్ పాల్గొన్నారు.

తొమ్మిది మంది తమిళ స్మగ్లర్ల్ల అరెస్టు