దాఖలు చేసిన గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: విజయవాడ బుడమేరు బాధితులకు గుంటూరు కార్పొరేషన్ తరఫున చేసిన సాయం దారి మళ్లించారనే అనుమానాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకోవడానికి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సిద్ధం అయ్యారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. వరద బాఽధితుల పేరుతో ఎవరి అనుమతి లేకుండానే మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఏకపక్షంగా ఖర్చు చేయడమే కాకుండా, రూ.9.22 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కౌన్సిల్లో ప్రశ్నించగా ఆ అంశం చర్చకు రాకముందే అధికారులు మరో అంశంపై కౌన్సిల్ను బాయ్కాట్ చేశారు. తర్వాత కౌన్సిల్ సమావేశం పెట్టడానికి ముందుకు రాకుండానే స్థాయీ సంఘం ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. అధికారులు చూపిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు పెట్టిన మొత్తం రూ.కోటిన్నర కూడా దాటదని పిటిషన్లో డైమండ్ బాబు పేర్కొన్నారు. మున్సిపల్ మంత్రి నుంచి తమకు వచ్చిన ఫోన్ ఆదేశాల మేరకు సహాయం అందించామని మున్సిపల్ కమిషనర్ పేర్కొంటే, గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి రాసిన లేఖలో దీనికి విరుద్ధంగా ఉందన్నారు.
ఇంత మొత్తం ఖర్చు చేయాలంటే కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదం తీసుకోవాలని గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి ఆడిట్, విచారణ నిర్వహించి దారి మళ్లించిన మొత్తాన్ని మున్సిపల్ కమిషనర్ నుంచి రికవరీ చేయాలని కోరారు. కిందిస్థాయి ఉద్యోగులకు రూ.1.59 కోట్లను అడ్వాన్స్ కింద చెల్లించడం కూడా చట్టవిరుద్ధమైనందున క్రిమినల్ ప్రాసీడింగ్స్ చేపట్టాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment